సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, మోడిఫైడ్ సైలెన్సర్స్, మల్టీ టోన్డో హారన్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు హెచ్చరించారు.
ఈ ఉల్లంఘనలపై గత నెల 24వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ 1398 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లు మీ దృష్టికి వస్తే 90102 03626కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, రిస్క్యూ ఆపరేషన్ టీమ్స్, పోలీస్ డిపార్టుమెంట్, మోటర్ వెహికల్ డిపార్టుమెంట్ వారు మాత్రమే సైరన్లను ఉపయోగించాలని సూచించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని అదనపు సీపీ వెల్లడించారు.
నగర ట్రాఫిక్ పోలీసులు గత ఏడాది సెప్టెంబర్ నెలలో రోప్ (రిమోవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్)ను ప్రారంభించారని అదనపు సీపీ తెలిపారు. రోప్పై ప్రజలలో అవగాహన కల్పించిన అనంతరం ఉల్లంఘనలపై కఠిన చర్యలు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నాలుగు నెలల్లో నమోదైన వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.