సుల్తాన్బజార్,ఆగస్టు 11. ప్రేమ పేరుతో అమాయక యువకులను వలలో వేసుకొని మోసం చేస్త్తున్న కేరళకు చెందిన మహిళపై బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్.. నవంబర్ 10వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాచకొండ కమిషనర్కు ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి జీవనం సాగిస్తున్న కేరళకు చెందిన ఓ మహిళ నగరానికి చెందిన యువకులను టార్గెట్ చేసుకొని.. ప్రేమ పేరుతో వల వేస్తున్నదన్నారు. పెండ్లి చేసుకుందామని నమ్మిస్తుందని, అడిగిన ప్రతిసారీ డబ్బులు ఇవ్వాలని.. లేని పక్షంలో అక్రమ కేసులు పెట్టించి.. జైలు పాలు చేస్తానని బెదిరించేదని వాపోయారు. తమలాగా ఇంకెవ్వరూ మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు చెప్పారు.