సిటీ బ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ ప్రజలు అన్ని విధాలుగా అవస్థలు పడుతున్నారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సకల వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. కరెంటు బిల్లుల నుంచి నల్లా బిల్లుల దాకా పెంచేసి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, ఉచితాల పేరిట ఊదరగొట్టి నగర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గ్రేటర్ ప్రజలకు కొత్త సమస్యలను తీసుకొస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.
కేసీఆర్ హయాంలో జల మండలి ద్వారా 20 వేల లీటర్లదాకా ఉచితంగా తాగునీరు సరఫరా చేశారు. 20 వేల లీటర్లు దాటాక నామ మాత్రపు బిల్లులతో బస్తీలు, కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. నామమాత్రపు బిల్లులను కూడా ఎక్కడా వసూలు చేయలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో రూ.వేలాదిగా నల్లా బిల్లులను వేస్తూ బస్తీల ప్రజల నెత్తిన కుదిబండ వేస్తున్నారు. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుల పేరిట రూ. వేలల్లో బిల్లులు వచ్చినట్లు రసీదులను ఇస్తున్నారు. మొత్తం బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు పేద ప్రజలకు హుకూం జారీ చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు చెల్లించేదెలా? అంటూ బడుగు జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పరిమితికి మించి బిల్లుల పేరిట రసీదులు ఇస్తూ దినసరి కూలీలు, వేతన జీవుల నడ్డి విరుస్తున్నది. అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తామంటూ అలవికాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను పీక్కు తింటున్నది. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో 20 వేల లీటర్ల వరకు మంచి నీటిని ఉచితంగా సరఫరా చేసి ఆ తర్వాత నామమాత్రపు బిల్లల పేరిట రసీదులిచ్చినా వసూలు చేయలేదని నగర ప్రజలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏడాది నుంచి ఇబ్బడిముబ్బడి బిల్లులను పెంచేసింది. కొద్దిరోజుల క్రితం దాకా జీరో బిల్లు పేరిట రసీదులిచ్చి నగర ప్రజలను మభ్యపెట్టారు.
కొద్దిరోజులుగా ఇన్నాళ్లుగా జీరో బిల్లులు ఇచ్చిన వాటి స్థానంలో మొత్తం బిల్లులు ఒకేసారి కలిపి తడిసి మోపెడయ్యాలే ఒక్కసారే ఇంటింటికీ రూ.వేలల్లో బిల్లుల రసీదులను పంపిస్తూ నగర ప్రజలను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.10 వేల నుంచి రూ.20 వేల బిల్లులతో రసీదులను అందజేస్తున్నారు. దీంతో ఒకేసారి అంత బిల్లు చెల్లించేదెలా? అంటూ పేద ప్రజలు తీవ్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా పాలన అంటే పేద ప్రజలపై బిల్లుల భారం మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలింపించినందుకు సరైన గుణపాఠం చెప్తున్నారంటూ వాపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో మొత్తం మోసం దగాలే రాజ్యమేలుతున్నాయని మండిపడుతున్నారు.
కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లతో బుద్ధి చెబుతామని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులతో బాహాటంగానే చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించినందుకు మంచినీరు, కరెంటు బిల్లులు సహా తమపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను మరోసారి ఓడగొట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తేల్చి చెప్తున్నారు. కాలనీలు, బస్తీల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులకు తమ బాధను వివరిస్తూ కాంగ్రెస్ మోసాలను చెప్పుకుంటున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను అవస్థల పాలు చేస్తున్నారని వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ను కాలగర్భంలో కలిపేస్తామని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జలమండలి అధికారులు ఎన్ని రసీదులిచ్చినా బిల్లులు చెల్లించబోమని తెగేసి చెప్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. షేక్పేటలో మేముండే అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్లు ఉన్నాయి. గతంలో నెలకు రూ.5 వేల నల్లా బిల్లు వచ్చేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.10 వేలకు చేరింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలను అన్నివిధాలా ఆదుకున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యాయి. అదనపు బిల్లులు వసూలు చేస్తున్న కాంగ్రెస్కు ఓటు ద్వారా బుద్ధి చెప్తాం.
-మహ్మద్ మోహిద్ సిద్ధీకీ, షేక్ పేట
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాగునీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసింది. మాకు గతంలో రూ.వెయ్యి బిల్లు వచ్చేది ఇప్పుడు రూ.రెండు వేలకు పెరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలకు నీటి బిల్లులు ఆర్థిక భారంగా తయారయ్యాయి. మోసం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ ఓడించి మాకు చేస్తున్న అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాం.
– మహ్మద్ అక్బర్, షేక్పేట