సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళాభారతిలో 8వ రోజు పుస్తకాల పండుగ సాహిత్య పరిమలాలను వెదజల్లింది. పలువురు రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణలతో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ వేదిక ప్రణమిల్లింది. మధ్నాహ్యం 2 నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుస్తకాల ఆవిష్కరణలు, ప్రముఖుల ప్రసంగాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సాహితీప్రియులను, సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, అలరింపజేశాయి.
‘మరణం నా చివరి చరణం కాదు- సమరమే నా అంతిమ చిరునామా’ అంటూ అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత్వంతో పుస్తక వేడుక ప్రాంగణంలో ఏర్పాటుచేసిన భారీ ఫ్లెక్సీ సందర్శకులను, సాహిత్య అభిమానులను ఎంతగానో ఆలోచింపజేస్తున్నది.
అలిశెట్టి సతీమణికి ఘన సన్మానం
దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ సతీమణి భాగ్యలక్ష్మిని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
కులం లేనట్లు నటిస్తున్నారు..!
సి-ఫర్-క్యాస్ట్ పుస్తక రచయిత సతీశ్ చందర్తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వపు చైర్మన్ ఘంటా చక్రపాణి సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా సతీశ్ చందర్ మాట్లాడుతూ.. దేశంలో కోట్లాది ప్రజలు కులం లేనట్లు నటిస్తున్నారని అన్నారు. ఇప్పుడు కులం ఎకడుందని నటించే మహానటుల సంఖ్య పెరిగిపోతుందని తెలిపారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అట్టడుగు కులం నుంచి వచ్చి ఒక సంపాదకుడిగా ఎదగడానికి 100 ఏండ్లు పట్టిందని అన్నారు.
తెలంగాణ సామాజిక ముఖచిత్రం గంగెద్దు
ప్రముఖ కవి రచించిన ‘గంగెద్దు’ తెలంగాణ సామాజిక ముఖచిత్రంగా ప్రతిబింబిస్తున్నదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శీలం భద్రయ్య రచించిన గంగెద్దు కథా సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.రఘు, సంఘిశెట్టి శ్రీనివాస్, వెల్డండి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ అంటే లక్ష్యాన్ని సాధించే తత్వం..!
కేసీఆర్ అంటే నమ్మకం, ధైర్యం, లక్ష్యాన్ని సాధించే తత్వం.. అందుకే ఉద్యమప్రస్తానం కలిగిన నేత, సీఎం కేసీఆర్ బాటలో 2001 నుంచి పయనిస్తున్నానని 35వ జాతీయ పుస్తక ప్రదర్శనలో బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నారు. 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు హాజరైన ఉపేంద్ర మన ముఖ్యమంత్రి బుక్ స్టాల్తో పాటు అనేక స్టాల్స్ను సందర్శించారు. తెలంగాణ యువత సీఎం కేసీఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద ఇన్ని పుస్తకాలు రాలేదని ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితం, ఉద్యమం, సాధించిన అభివృద్ధిపై అనేక రచనలు వచ్చాయని అన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.
అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి ఆవిష్కరణ..
తడక మోహన్ గంగాదేవి సైదులు రచించిన ‘అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి’ జీవిత చరిత్ర పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, తదితరులు ఆవిషరించారు.
వేదికపై కథకుల సదస్సు
అలిశెట్టి ప్రభాకర్ వేదిక పై కథకుల సదస్సు జరిగింది. ప్రముఖ కథకుడు, సినీ మాటల రచయిత పెద్దంటి అశోక్కుమార్ అధ్యక్షత వహించి తన ‘గుడ్డు దొంగ’ కథ నేపథ్యాన్ని వివరించారు. తాళ్లపల్లి యాకమ్మ తన మౌన సాక్షి కథను, మారోజు దేవేంద్ర వెండి బరిణె కథను, వెల్దండి శ్రీధర్ పోకిలి కథను, మన్నె ఎలియా మర్రి చెట్టు కథను, కథ నేపథ్యాలను వివరించారు. అనంతరం జూలూరుగౌరీ శంకర్ కథకులను సన్మానించారు.
బుక్ డొనేషన్ బాక్స్ ప్రారంభం
పుస్తక ప్రదర్శనలో బుక్ డొనేషన్ బాక్స్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వపు చైర్మన్ ఘంటా చక్రపాణి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, డాక్టర్ కొండా నాగేశ్వర్రావు, షెబాజ్, డాక్టర్ నీరజ, నరేశ్ జిల్లా తదితరులు ప్రారంభించారు.
ఏడు తరాల తలపోత..
బల్ల సరస్వతి రచించిన కలెనేత (ఏడు తరాల తలపోత) ఆత్మకథను రచయిత విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, రచయిత, విమర్శకులు అంబటి సురేందర్ రాజు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ రచయిత జూపాక సుభద్ర ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ పద్మశాలీ కుటుంబీకులు తమ ఇంట్లో గౌరవంగా భద్రంగా దాచుకోవాల్సిన పుస్తకం కలెనేత అని అన్నారు. కలెనేతపై ఉస్మానియా వర్సిటీలో చర్చ పెట్టాలని తెలుగు శాఖ ప్రొఫెసర్ కాశీంకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంబటి సురేందర్రాజు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, రచయిత జూపాక సుభద్ర , ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ఉన్నారు.