Hyderabad | తెలంగాణలో ఎన్నికల కోడ్లో అమలులోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీగా హవాలా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.3కోట్లకుపైగా నగదును సీజ్ చేశారు. ఎన్నికల కోడ్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. తనిఖీలో రూ.3.35కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుకున్న నగదును హవాలా డబ్బుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. డబ్బును తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
నలుగురు ఏపీకి చెందిన వ్యక్తులని.. రూ.కోటికి రూ.25వేల కమిషన్ తీసుకుంటున్నారని డీసీపీ వివరించారు. హవాలా వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం రూ.50వేలకుపైగా డబ్బులను తీసుకువెళ్లే తప్పనిసరిగా నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. సోమవారం హైదరాబాద్ ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఏడు కిలోలకుపైగా బంగారం, మూడు కిలోలకుపైగా వెండి.. కోట్లల్లో నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.