హైదరాబాద్: మూసీ (Musi) నదికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్కు (Himayat Sagar) పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గేట్లు ఎత్తి 2,750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ (Osman Sagar) నుంచి 852 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ముసారంబాగ్ బ్రిడ్జి (Moosarambagh bridge) వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. బ్రిడ్జిని ఆనుకుని నీరు వెళ్తున్నది.
కాగా, హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేని వానలతో హుస్సేన్సాగర్కు (Hussain sagar) భారీగా వరద నీరు వస్తున్నది. ట్యాంక్బండ్లో ప్రస్తుతం 513.60 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. దీంతో అధికారులు తూముల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.