Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. రైతుబజార్ సమీపంలోని పెట్రోలు బంక్ ముందు ఉన్న ఓ బ్రెడ్ ఆమ్లెట్ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో షాపులో ఉన్న వర్కర్స్ బయటకు పరుగులు తీశారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో షాపు మొత్తం కాలిపోయింది. పక్కనే ఉన్న షాపునకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. బాంబు పేలిందేమోనని భయపడ్డారు. అనంతరం టిఫిన్ సెంటర్లో సిలిండర్ పేలిందన్న విషయం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా, గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.