సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): పురాతన వైభవాన్ని మోసుకొస్తూ..విద్యారంగంలో విశ్వ శోభితంగా వెలుగొందుతున్నది బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. 1923 నుంచి 2023 వరకు వందేండ్ల ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా ఎంతోమంది సరస్వతీ పుత్రులను ఉత్తములుగా తీర్చిదిద్ది, ఖండాంతరాలకు అందించిన ఘనత హెచ్పీఎస్ది. నూరేండ్ల ఉత్సవాలను పురస్కరించుకొని సంవత్సరం పాటు వేడుకలను నిర్వహిస్తున్నది. జనవరిలో ప్రారంభమైన సెంటినరీ వేడుకలు డిసెంబర్ 27తో ముగియనున్నాయి.
సత్య నాదెళ్లతో గ్లోబల్ వేదికపై మెరిసిన హెచ్పీఎస్..
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతో హైదరాబాద్లోని హెచ్పీఎస్కు గ్లోబల్ వేదికపై విద్యారంగంలో గుర్తింపు లభించినట్లయింది. ఆయనతో పాటు ఎంతో మందిని సరస్వతీ పుత్రులను తీర్చిదిద్దడంతో పాటు విద్యారంగ సేవల్లో దేశంలోనే ఉత్తమ గుర్తింపు పొందింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు.
ప్రముఖుల ప్రసంగాలకు వేదికగా..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రముఖ వ్యాపార, సినీ, రాజకీయరంగాలతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, సైంటిస్టులు, ప్రొఫెసర్ల ప్రసంగాలకు వేదికగా నిలుస్తున్నది. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రముఖుల ప్రసంగాలు ఎంతో ప్రభావితం చేస్తున్నట్లు పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. దివంగత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వక్తలు హెచ్పీఎస్ను సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినట్లు వివరించారు.
హెచ్పీఎస్కు అవార్డుల పంట..
విద్యారంగంలో విశేష సేవలందించినందుకు గాను హెచ్పీఎస్ను అనేక అవార్డులు వరించా యి. ప్రతి యేటా దేశంలోని టాప్ 20 ఉత్తమ పాఠశాలల్లో హెచ్పీఎస్ నిలుస్తుందని పాఠశాల డైరెక్టర్స్ కమిటీ పేర్కొన్నది. అవార్డులతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తూ.. ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, పాఠశాల సొసైటీ కమిటీ నిర్విరామంగా కృషి చేస్తున్నది.