Hyderabad | హైదరాబాద్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో నమోదైన నివాస విక్రయాల వివరాలను ఆర్ఈఏ ఇండియాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్ఫామ్, హౌజింగ్ బ్రోకరేజీ ప్రాప్టైగర్.కామ్ వెల్లడించింది. ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్-జూలై-సెప్టెంబర్ 2023’ పేరిట గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో సేల్స్పై ఈ రిపోర్టు వచ్చింది. ఈ నగరాల్లో హౌజింగ్ సేల్స్ 22 శాతం, కొత్త నిర్మాణాలు 17 శాతం పెరిగాయన్నది.
గత ఆర్థిక సంవత్సరం (2022-23) జూలై-సెప్టెంబర్లో ఈ 8 నగరాల్లో 83,220 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఈసారి 1,01,220 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నై మినహా అన్ని నగరాల్లో ఈసారి వృద్ధి కనిపించినట్టు ప్రాప్టైగర్.కామ్ తెలియజేసింది. అలాగే కొత్త ప్రాజెక్టులు 17 శాతం ఎగిసి 1,23,080 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు 1,04,820 యూనిట్లే. కాగా, అమ్మకాల్లో ముంబై-ఎంఆర్, పుణెల వాటానే దాదాపు సగం ఉన్నాయని ప్రాప్టైగర్.కామ్ వెల్లడించింది. అయితే దేశ వాణిజ్య రాజధాని ప్రాంతం కావడం కలిసొచ్చింది.
హైదరాబాద్లో నిరుడు జూలై-సెప్టెంబర్తో పోల్చితే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో ఇండ్ల విక్రయాలు 3,620 యూనిట్లు పెరిగాయి. పోయినసారి 10,570 ఇండ్లు అమ్ముడయ్యాయి. ఈసారి 14,190 ఇండ్లకు విక్రయాలు పెరిగాయని ప్రాప్టైగర్.కామ్ తమ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇదిలావుంటే చెన్నైలో 12 శాతం ఇండ్ల అమ్మకాలు ఈసారి క్షీణించినట్టు తేలింది. కాగా, ఈ జూలై-సెప్టెంబర్లో నివాసానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు ఆక్యుపై) ఇండ్ల అమ్మకాలు 14 శాతం ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే కోటి రూపాయలకుపైగా విలువైన ఇండ్ల విక్రయాలూ 31 శాతం పెరిగాయని స్పష్టమైంది. 8 నగరాల్లోని అపార్టుమెంట్లు, విల్లాల విక్రయాలనూ ప్రాప్టైగర్.కామ్ తమ రిపోర్టులో పరిగణనలోకి తీసుకున్నది. కాగా, ప్రాప్టైగర్.కామ్ అనుబంధ సంస్థలే హౌజింగ్.కామ్, మకాన్.కామ్ అన్న విషయం తెలిసిందే.
-బిజినెస్ బ్యూరో
హైదరాబాద్సహా దేశంలోని టాప్-7 నగరాల్లో రూ.40 కోట్లు, ఆపై విలువైన అల్ట్రా-లగ్జరీ ఇండ్ల విక్రయాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా మొత్తం ఈ ఏడు నగరాల్లో 58 ఇండ్లు అమ్ముడయ్యాయని చెప్పింది. అయితే ముంబైలోనే ఏకంగా 53 యూనిట్లు అమ్ముడవడం విశేషం. మిగతా ఐదు యూనిట్లలో ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందినవి నాలుగు ఉండగా.. వీటిలో గురుగ్రామ్లో రెండు అపార్ట్మెంట్లు, ఢిల్లీలో రెండు బంగ్లా లావాదేవీలున్నాయి. ఇక ఒకటి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అమ్ముడైనట్టు అనరాక్ తెలియజేసింది. చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెల్లో సేల్స్ లేవన్నది. ఇక నిరుడు మొత్తంగా ఈ నగరాల్లో 13 అల్ట్రా-లగ్జరీ ఇండ్లే అమ్ముడయ్యాయి. ఈసారి అవి 58కి పెరుగగా, వీటి విలువ రూ.4,063 కోట్లుగా ఉన్నది. గత ఏడాది అమ్మకాల విలువ రూ.1,170 కోట్లు. హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్, అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ నుంచి వీటికి డిమాండ్ కనిపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు. కాగా, ముంబైలో జరిగిన 53 లావాదేవీల్లో రూ.200 కోట్లకుపైగా విలువైనవి మూడున్నాయి. రూ.100-200 కోట్ల మధ్య 7 ఇండ్ల ధరలున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో జరిగిన లావాదేవీల్లోనూ రెండు ఇండ్లు ఒక్కోటి రూ.100 కోట్లపైనే పలికాయి. ఇదిలావుంటే హైదరాబాద్తోపాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.4 కోట్లకుపైగా విలువైన ఇండ్ల అమ్మకాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ ఇటీవలే ఓ నివేదికను విడుదల చేయగా, ఇందులో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిన సంగతి విదితమే. మొత్తం విక్రయాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ల వాటానే 90 శాతం ఉండటం విశేషం. ఢిల్లీ-ఎన్సీఆర్ 37 శాతం, ముంబై 35 శాతం, హైదరాబాద్ 18 శాతంతో ఉన్నాయి.
దేశంలోని టాప్-8 నగరాల్లో హౌజింగ్ మార్కెట్లు వృద్ధిపథంలో సాగుతున్నాయి. పాజిటివ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ కలిసొస్తున్నది. గృహ రుణాలపై వడ్డీరేట్లు స్థిరంగా ఉండటం, ప్రజల ఆదాయం పెరుగడం.. సేల్స్ను పెంచుతున్నది.
-వికాస్ వాధవాన్, ప్రాప్టైగర్.కామ్ వ్యాపార అధిపతి