మల్కాజిగిరి, అక్టోబర్ 8: ప్రజలకు న్యాయపరంగా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నేరేడ్మెట్ వినాయక్నగర్ పరిధిలో ఉన్న 22 కాలనీలకు చెందిన 80 వేల కుటుంబాలు భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పడుతున్న ఇబ్బందులను మర్రి రాజశేఖర్ రెడ్డి గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ సహాయంతో సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. సర్వే నంబర్ 278లో ఉన్న 236 ఎకరాల భూమి క్రమబద్ధీకరణకు గతంలో ఒక గజానికి రూ.27,000 లు చెల్లించాల్సి ఉండేదని, ఈ విషయాన్ని స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని గుర్తించి, విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. పేదలను దృష్టిలో పెట్టుకుని జీఓ నంబర్ 118 ద్వారా గజానికి కేవలం రూ.250 మాత్రమే చెల్లించేలా చేశారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేశ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, సర్కిల్ ఉపాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, జేఏసీ వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
అమ్మ చెప్పిందని ఉచిత వైద్యం
అమ్మ చెప్పిందని ప్రజలకు అరుంధతి దవాఖాన ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి డివిజన్ నేరేడ్మెట్లోని అంబేద్కర్ భవన్, గౌతంనగర్లోని కట్ట మైసమ్మ గుడి వద్ద, అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ భూదేవినగర్లోని పార్కులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల్లో దాదాపు వెయ్యి మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. మరి కొంత మందిని అరుంధతి దవాఖానకు రెఫర్ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… గుండె జబ్బులు, లాప్రోస్కోపి, ప్లాస్టిక్ సర్జరీలు, స్త్రీ రుగ్మతలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితాకిశోర్, సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, పరశురాంరెడ్డి, అనిల్కిశోర్, ఉపేందర్ రెడ్డి, జేఏసీ వెంకన్న, సిద్దిరాములు, రాజేశ్కన్న, ప్రభాకర్ పాల్గొన్నారు.