పీర్జాదిగూడ, ఆగస్టు 13: పని చేస్తున్న యజమాని ఇంటి గ్రిల్స్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన బాలుడితో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 23 లక్షల విలువైన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో జోన్ డీసీపీ రక్షిత కె.మూర్తి, మేడిపల్లి పోలీస్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, జోదాపూర్ జిల్లాకు చెందిన బాలుడు (15) బోడుప్పల్ మెక్డోల్ కాలనీ హేమానగర్లో నివాసం ఉంటున్న డీఆర్. మోహన్లాల్ చౌదరి,హర్డ్వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్కు చెందిన బాలుడిని పనికి కుదుర్చుకున్నాడు.షాపులో పనిచేస్తూ యజమాని ఇంట్లోనే ఉంటున్నాడు. 15 రోజులు పనిచేసిన తరువాత బాలుడిని సరిగా పని చేయడం లేదని తిరిగి రాజస్థాన్కు పంపించాడు.
పనిచేసిన రోజు నుంచి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమీ ఉన్నాయో గమనించాడు. ఇంటి నుంచి పంపించిన యజమాని ఇంట్లో చోరీ చేయడానికి ప్లాన్ వేశాడు. ఇందుకు స్థానికంగా ఉన్న స్నేహితులు బల్వంత్ చౌదరి(21) చదువుకుంటున్నాడు.రామ్ నివాస్ (21) సునీల్ చౌదరి(21) వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ముగ్గురికి పనిచేసిన యజమాని ఇంట్లో డబ్బులు బాగా ఉన్నాయన్న విషయం చెప్పి దొంగతనం చేయడానికి ఒప్పించాడు. నలుగురు కలిసి ఈ నెల 6వ తేదీన రాజస్థాన్ నుంచి కారులో హైదరాబాద్కు వచ్చారు. బోడుప్పల్లో ఉన్న మోహన్లాల్ ఇంటి పరిసరాల్లో రెండు రోజులు పరిశీలించారు.
ఈ నెల 8వ తేదీన ఉదయం మోహన్లాల్ షాపునకు వెళ్లగా కుటుంబసభ్యులు అల్వాల్లోని ఆలయానికి వెళ్లారు. ఇది గమనించిన వెంటనే ఇంటికి వెళ్లారు. ప్లాన్ ప్రకారం ఇంటి కిచెన్ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లోని బీరువా పగులగొట్టి బంగారు, వెండితో పాటు నగదు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా శనివారం ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద కారులో వెళ్తూ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాన్ని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.23 లక్షల విలువైన 19 తులాలన్నర బంగారు ఆభరణాలు, 954 తులాల వెండి వస్తువులు, రూ. 3లక్షల 89 వేల289 నగదు, 4 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని జువెనల్ హోంకు, మిగతా ముగ్గురిని రిమాండ్కు తరలించారు.