మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 3 : సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. అంతకుముందు 8వ వార్డు ఎస్వీనగర్లో రూ. కోటి 30 లక్షలతో నిర్మించనున్న నీటి ట్యాంక్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు.
ఏండ్ల నాటి పేదల కలలను జీవో 58, 59లతో సీఎం కేసీఆర్ సాకారం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని చెప్పారు. పేదలకు పట్టాలు ఇవ్వడంతో వారిలో ధైర్యం పెరిగిందన్నారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబరక్, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రహమాన్, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటిపై పూర్తి హక్కులు వచ్చాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ 58 జీవో కింద అందించిన పట్టాలతో ఇండ్లపై పూర్తి హక్కులు వచ్చాయి. గతంలో పూర్తి స్థాయిలో ఇంటిపై హక్కులు లేక ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ పట్టలు ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది.
– కె.శ్రీవాణి, హనుమాన్ నగర్, దమ్మాయిగూడ
నిరుపేదలకు పెద్దన్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ నిరుపేదలకు పెద్దన్న. ప్రభుత్వ స్థలంలో గృహాన్ని నిర్మించుకున్నా సరైన పత్రాలు లేక ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ అమలు చేసిన 58 జీవోతో మాకు ఇండ్ల పట్టాలు వచ్చాయి.
– జె.చంద్ర, భాగ్య నగర్, నాగారం