చాదర్ఘాట్, నవంబర్ 11: ‘దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు. వారికి మెరుగైన జీవన-స్థితిగతులను కల్పించడంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది. ఉన్నత విద్యాభ్యాసం అందించకుండా ఎంతో మందిని నిరక్ష్యరాసులుగా మిగిల్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ముసలి కన్నీరు కార్చినట్లుగా మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారు’అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తారు.
శనివారం ఆజంపురాలోని హోం మంత్రి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం కేవం 2,219.57 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లలో ముస్లింలు, మైనార్టీల సంక్షేమం కోసం రూ.10,139.11 కోట్లను ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ కేవలం కుట్రలు చేస్తూ, మాటలకు పరిమితమై ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కర్ణాటకలో 95 లక్షలున్న మైనార్టీలకు 2,100 కోట్లు, రాజస్థాన్లో 78.06 లక్షలకు 1,973 కోట్లు, బీహార్ రాష్ట్రంలో 1.77 కోట్ల మైనార్టీల జనాభకు కేవలం 700 కోట్లు, జార్ఖండ్లో 62.98 లక్షలకు 320.8 కోట్లు, అదే దేశంలోని 25 కోట్ల మైనార్టీల జనాభకు కేంద్ర ప్రభుత్వం 3,097 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 50.05 లక్షల జనాభా ఉన్న మైనార్టీల కోసం ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2,200 కోట్ల బడ్జెట్ను కేటాయించి మైనార్టీల పక్షపాతి అని రుజువు చేశారని ఆయన అన్నారు.
రాష్ట్రం వ్యాప్తంగా 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను ఏకకాలంలో ఏర్పాటు చేసి నిరుపేదలైన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారన్నారు. స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తూ కాలేజీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. 11 మంది ఎంబీబీఎస్, 140 బీడీఎస్, ఒక పైలట్, 1500 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు తీర్చిదిద్ది ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. మహమబూబ్నగర్కు చెందిన టెమ్రీస్ స్కూల్ విద్యార్థికి పైలట్ శిక్షణ కోసం రూ.35 లక్షలు కేటాయించి శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు, వారికి మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలను కల్పించడంలో రాజీపడడం లేదన్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, కార్పొరేట్ సంస్థలు కూడా కల్పించడం లేదన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిని అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. మైనార్టీలపై కల్లబొల్లి వాగ్దానాలు చేస్తూ మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో పథకాల పేరుతో ఆకర్షించేందుకు కుయుక్తులు పన్నుతురన్నారని, మైనార్టీ డిక్లరేషన్ ద్వారా ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో లేని ఎం.ఫిల్ విద్యార్థుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పడం వారి దివాలాకోరుతనానికి నిదర్శమని దుయ్యబట్టారు. అమలుకు సాధ్యం కానీ పథకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసేందకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానాలను ఇస్తున్నారని ఆరోపించారు. వాస్తవంగా మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మలక్పేట నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీ, ప్రధాన కార్యదర్శి లాయక్ అలీ తదితరులు ఉన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.