అమీర్పేట్, నవంబర్ 14: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటే నాయకులకు తెగువ అవసరమని, అటువంటి తెగువ ఉన్న నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏ స్థాయికైనా వెళ్లే దమ్ము, ధైర్యం, మంచి లక్షణాలున్న శ్రీనివాస్ యాదవ్ మీకు ఎమ్మెల్యేగా ఉండటం మీ అదృష్టమని అల్లాద్దీన్ కోఠీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు.
మంగళవారం సనత్నగర్ డివిజన్లోని అల్లాద్దీన్ కోఠి బస్తీలో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం, బస్తీ కమ్యూనిటీ హాల్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో హోం మ్రంతి మాట్లాడుతూ నిరుపేద మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య అందుబాటులోకి వచ్చేలా చేసింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కుట్టబడి ఉన్నారన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఓ ముస్లిం వ్యక్తికి అత్యంత కీలకమైన రెవెన్యూ, హోం మంత్రి హోదాలిచ్చిన చర్రిత లేదన్నారు. లక్షలాది నిరుపేదల ముస్లిం ఆడపిల్లల వివాహాలకు షాదీ ముబారక్ పథకం కింద ఆర్థికంగా చేయూతనందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ముస్లిం యువతుల వివాహాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా మంత్రి తలసాని అందిస్తున్న చేయూత మరువలేనిదన్నారు. నియోజకవర్గం పరిధిలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిన తలసాని శ్రీనివాస్యాదవ్ గెలుపునకు ప్రతి మైనార్టీ ఓటరు బాసటగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీ ఉల్లాఖాన్, కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, బస్తీ అధ్యక్షులు కరీం లాలా, బీఆర్ఎస్ నాయకులు ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.