ప్రజలకు తాగునీరు సరఫరా చేయడమంటే.. ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. జలమండలి పరిధిలో కొత్తగా మేనేజర్లుగా ఉద్యోగాల్లో చేరిన ఇంజనీర్లకు జలమండలి ఎండీ దాన కిషోర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావంతో విధులను నిర్వహిస్తూ జలమండలికి మంచి పేరు తేవాలని ఎండీ నూతన ఇంజనీర్లకు సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుమారు వారం రోజుల పాటు జూమ్ మీటింగ్ ద్వారా వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వారం రోజుల్లో వివిధ విభాగాల డైరెక్టర్లు, తాగునీరు, మురుగు నీటి శుద్ధి, ప్రాజెక్టులు, ఫైనాన్స్, పర్సనల్, ఎన్ఆర్డబ్లూ, కస్టమర్ కేర్, సీడాక్, ట్రాన్స్మిషన్, తాగునీటి శుద్ధి తదితర అంశాలపై మేనేజర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. అనంతరం, వీరికి పోస్టింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకోకున్నారు. వీరికి త్వరలోనే మంత్రి కేటీఆర్ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తారన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా॥ ఎం.సత్యనారాయణ, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు.