సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో అభివృద్ధి పనుల కార్యాచరణ చకచకా జరుగుతున్నది. రోజు రోజుకు నగర విస్తీర్ణం పెరగడంతో మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా నగరంలో మరో భారీ రోడ్డు విస్తరణ పనులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ శ్రీకారం చుట్టింది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ అత్యంత మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు వంద కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. ముంబై జాతీయ రహదారిపై ఉన్న మియాపూర్ చౌరస్తా నుంచి మెదక్ -నర్సాపూర్ జాతీయ రహదారిని కలిసే గండి మైసమ్మ జంక్షన్ వరకు రోడ్డును విస్తరించనుంది. ఇందుకోసం సుమారు రూ.104.98 కోట్ల అంచనా పనులు చేపట్టేందుకు ఇటీవలే టెండర్లు సైతం పిలిచింది.
ఐటీ కారిడార్ తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, ఐడీఏ బొల్లారం, ప్రగతినగర్, బౌరంపేట ప్రాంతాల్లో జనావాసాలు గణనీయంగా పెరగడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అమాంతం పెరిగిపోయింది. మియాపూర్ నుంచి గండి మైసమ్మ చౌరస్తా మీదుగా మేడ్చల్ మార్గం కావడంతో రోడ్డును విస్తరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ గత కొన్ని రోజులు ఈ మార్గంలో ట్రాఫిక్పై అధ్యయనం చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డును 150 చదరపు అడుగుల విస్తీర్ణంతో విస్తరించాలని నిర్ణయించింది. సుమారు 15 కి.మీ పొడవుతో ఉన్న ఈ రోడ్డు విస్తరణ ద్వారా చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది.
ప్రస్తుతం కోర్ సిటీలో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు గ్రేటర్ చుట్టూ లేకుండా ఉండేందుకు విశాలమైన రోడ్లను, అవసరమైన చోట్ల లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మియాపూర్ – గండి మైసమ్మ మార్గంలో బాచుపల్లి చౌరస్తాలో హెచ్ఎండీఏ కొత్తగా ఫ్లై ఓవర్ బ్రిడ్జీని నిర్మిస్తోంది. ప్రస్తుతం, ఈ బ్రిడ్జీ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. బాచుపల్లి చౌరస్తా నుంచి మల్లంపల్లి మీదుగా ఔటర్ రింగు రోడ్డు వెళ్లే మార్గాన్ని ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టింది. ఇలా నగరంలో అవసరమైన చోట రోడ్డు నెట్వర్క్ను మెరుగుపర్చేందకు వందల కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని రోడ్ల విస్తరణ, లింకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది.