సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్లోకి ఇప్పటికీ ఇంకా వచ్చి చేరుతున్న మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల 5 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 30 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాలను 10, 40, 60 ఎంఎల్డీల సామర్థ్యానికి పెంచాలని అధికారులు నిర్ణయించారు. నగరంలోని హుస్సేన్సాగర్ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్బండ్, సంజీవయ్యపార్కు, నెక్లెస్ రోడ్డు, జల విహార్, పీపుల్స్ ప్లాజాలకు నిత్యం పర్యాటకులు వచ్చి సాగర్ చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదిస్తున్నారు. అయితే హుస్సేన్సాగర్లోని జలాలు మురుగునీటితో కలుషితం కాకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా సాగర్ జలాలు స్వచ్ఛంగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలకు మరింత శోభను తెచ్చేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
మూడు చోట్ల నిర్మాణం…
ప్రస్తుతం హుస్సేన్సాగర్ చుట్టూ మూడు ప్రధాన నాలాలు ఉన్నాయి. ఇందులో బుల్కాపూర్ నాలా (ఖైరతాబాద్), కూకట్పల్లి-బేగంపేట నాలా (నెక్లెస్ రోడ్డు), పికెట్ నాలాలు ఉండగా, వీటి నుంచి మురుగునీరు హుస్సేన్సాగర్లోకి వచ్చి చేరుతోంది. గతంలో హుస్సేన్ సాగర్ లేక్ ప్రాజెక్టు (హెచ్ఎస్ఎల్పీ)ను జైకా నిధులతో చేపట్టారు. ఖైరతాబాద్ వద్ద 20 ఎంఎల్డీ, పాటిగడ్డ వద్ద 30 ఎంఎల్డీ, కూకట్పల్లి-బేగంపేట నాలాపై మరో 5 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించారు. పైనుంచి వచ్చే మురుగునీటి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచి పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తరువాతే సాగర్లోకి వదలాలని అధికారులు నిర్ణయించారు. పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ టెండర్లు కూడా పిలిచింది. మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షించనున్నారు.