సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వివాదాలు లేని ప్రభుత్వ భూములను పారదర్శకంగా విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిందని హెచ్ఎండీఏ సెక్రెటరీ చంద్రయ్య అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని హోటల్ టూరిజం ప్లాజాలో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ ల్యాండ్ పార్సెల్కు మంచి డిమాండ్ నెలకొందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు సమీపంలో ల్యాండ్ పార్సెల్స్ ఉండడంతో వాటి కోసం ఎంతో మంది ఆసక్తి కనబరిచారన్నారు.
ఘట్ కేసర్ సమీపంలోని కొర్రెముల, బాచుపల్లి, కూకట్పల్లి సమీపంలోని మూసాపేట్, గండిమైసమ్మ సమీపంలోని బౌరంపేట్, కుత్బుల్లాపూర్ సమీపంలోని సూరారం ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది(8) ల్యాండ్ పార్సెల్ను సొంతం చేసుకోవడానికి వీలుగా ఔత్సాహికులు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపించారన్నారు. కాగా, ఔత్సాహికుల ప్రశ్నలకు, వారి సందేహాలకు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు, మేడ్చల్ మలాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రీ బిడ్ సమావేశానికి హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) గంగాధర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కె.చంద్రారెడ్డి, శ్రీనివాస్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ హాజరయ్యారు.