మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ భూముల వేలానికి తెరలేపింది. ఈ వ్యూహాంలో భాగంగానే ఈ నెల 17 నుంచి సుమారు రూ. 3వేల కోట్ల విలువైన ప్లాట్ల విక్రయానికి సర్వం సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ ఖజానా నింపుకొనేందుకు కొనసాగుతున్న ఈ వేగవంతమైన ఫండ్ ఫూలింగ్, వేలం ప్రక్రియలపై నగరవాసులు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, జూన్ 7(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి తక్షణ ఆర్థిక అవసరాలు తీరాలన్నా… సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చాలన్నా, అభివృద్ధి పనులను పట్టాలెక్కించడానికి భూముల అమ్మకమే ఏకైక మార్గంగా మారినట్లు కనిపిస్తోంది. రాబోయే ఆరు నెలల యాక్షన్ ప్లాన్ ద్వారా హెచ్ఎండీఏ పరిధిలోని అత్యంత విలువైన ఓపెన్ ప్లాట్లు, ల్యాండ్ పార్శిళ్లను వేలానికి ఉంచుతున్నారు. జూన్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ వేలం ద్వారా మొదటి విడతలోనే రూ. 3వేల కోట్లు గుంజాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాత్రికి రాత్రే నిధులు సమకూర్చుకోవాలనే ఈ ఆర్థిక దాహంతో భవిష్యత్ తరాల అవసరాలను ప్రభుత్వం పూర్తి విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనుమరుగవుతున్న ప్రభుత్వ భూములు
మహానగరంలో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భవిష్యత్తో ప్రజల ఉమ్మడి అవసరాల కోసం ప్రభుత్వ స్థలాలు ఎంతో కీలకం. రేపు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, ఆర్టీసీ బస్టాండ్లు, ఆట స్థలాలు, పార్కుల నిర్మాణానికి స్థలాలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? మాస్టర్ ప్లాన్ ప్రకారం పబ్లిక్ యుటిలిటీస్ కోసం కేటాయించాల్సిన భూములను సైతం వేలం వేసి ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థల చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది సర్కార్ తెలుసుకోవాల్సింది.
హరితహారానికి తూట్లు…
ఒకవైపు పర్యావరణ సమతుల్యత, అర్బన్ ప్లానింగ్ గురించి మాట్లాడే ప్రభుత్వం, నగరానికి ప్రాణవాయువును అందించే ఖాళీ స్థలాల్లో విస్తరించిన గ్రీన్ కారిడార్లను కాంక్రీట్ జంగిల్గా మార్చడానికి తానే స్వయంగా నోటిఫికేషన్లు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. ఇటీవల హెచ్ఎండీఏ జారీ చేసిన వేలం నోటిఫికేషన్ పరిశీలిస్తే, కేవలం ల్యాండ్ వాల్యూను క్యాష్ చేసుకోవడమే పరమావధిగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్లను అడ్డం పెట్టుకుని, గరిష్ఠ ధరలు పలికే కోకాపేట, బుద్వేల్ వంటి ప్రాంతాలతోపాటు నగర శివారుల్లోని లే అవుట్లను కూడా వేగంగా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. నగరాభివృద్ధి సంస్థగా వ్యవహరించాల్సిన ఈ సంస్థ, కేవలం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థలా భూముల అమ్మకానికే పరిమితమవ్వడం నగర ప్రణాళికాబద్ధమైన వృద్ధిని దెబ్బతీస్తుందని అర్బన్ ప్లానింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుస్థిర అభివృద్ధి ఇంకెప్పుడూ?
అభివృద్ధి, సంక్షేమ పేరుతో ప్రభుత్వ భూములను మంగళం పాడుతూ తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాలతో ఉపశమనం పొందుతుంది. కానీ దీర్ఘకాలంలో ఇదీ హైదరాబాద్ నగర మౌలిక స్వరూపాన్నే మార్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారిన నగర సంపదగా ఉండాల్సిన భూములు ఇలా వేలంపాటలతో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడితే… భవిష్యత్లో నగరంలో తీవ్రమైన స్థలాభావం, పర్యావరణ సమతుల్యత లోపంతో కొట్టుమిట్టాడక తప్పదు. ఇప్పటికైనా కేవలం ఆదాయ వనరులుగా ప్రభుత్వ భూములను చూస్తున్న ప్రభుత్వం… సుస్థిరమైన నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జూన్ 17 నుంచి భూముల వేలం
ఈ నెల 17 నుంచి భూముల వేలం పూర్తి కానుండగా, హకీంపేట్ ల్యాండ్ పార్శిల్(8.24ఎకరాలు)లతో, మోకీలా, మేడిపల్లి లే అవుట్, చందానగర్, బైరాగిగూడ, నార్సింగి, బౌరంపేట్, సూరారం, పీర్జాదిగూడలోని ల్యాండ్ పార్శిళ్లను విక్రయించనున్నారు. ఇందులో కోర్ సిటీలో ఉన్న షేక్పేట్ మండలంలోని హాకీంపేట్ గ్రామ పరిధిలో ఉన్న 8.24 ఎకరాల భూములతో ఏకంగా రూ. 1500 కోట్లు సమకూర్చుకునేందుక సన్నాహాలు చేస్తుండగా… ఈ నెల 30వరకు నిర్వహించే వేలంతో ఏకంగా రూ. 3వేల కోట్లు ఆదాయం తీసుకోవాలని చూస్తోంది.