సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): లాక్కోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగుతున్నది. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ సర్వేలు చేయడం, మార్కింగ్లు పెట్టి నోటీసులు అందించమే పరమావధిగా పనిచేస్తున్నారు. పట్టా భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములతో సహా పేదల ఇండ్లను సైతం కూల్చేసి లాక్కుంటున్నారు. తాజాగా అధికారులు సర్వే చేసిన హిమాయత్సాగర్ గ్రామంలో కూడా ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన భూములను సైతం స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. అధికారులు ప్రభుత్వానికి చెందినదని అని చెప్తున్న హిమాయత్సాగర్ పరిధిలోని దాదాపు 15 ఎకరాల భూమిని వందేంళ్ల కిందట నిజాం ప్రభుత్వం కొంతమంది రైతులకు ఇచ్చింది. అప్పట్లో హిమాయత్సాగర్ నిర్మాణం జరిగేటప్పుడు కట్ట నిర్మాణానికి కొంత మంది పనిచేశారు.
అప్పటి నిజాం ప్రభుత్వం వారికి బతుకుదెరువు చూపుతూ వ్యవసాయం చేసుకునేందుకు భూమిని ఇచ్చింది. అలా భూములు తీసుకున్న వారి పిల్లలు, వారికి పిల్లలు అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట ఆయా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఆయా భూములను సర్వే చేయడానికి వెళ్లిన అధికారులే స్వయంగా ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని.. వాటికి సర్వే, నోటిఫికేషన్ అవసరం లేదు.. నేరుగా స్వాధీనం చేసుకుంటామని అక్కడి ప్రజలకు చెప్పినట్లు తెలుస్తున్నది. నాడు కాయకష్టం చేసినందుకు నిజాం సర్కార్ ఇచ్చిన భూమిని కూడా రేవంత్రెడ్డి సర్కార్ వదలడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూములు వదులుకునే ప్రసక్తే లేదు
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి మా తాతలు కూలీ పనిచేయడానికి ఇక్కడకు వచ్చారు. రిజర్వాయర్ పూర్తయిన తర్వాత బతకడానికి ఇక్కడే అప్పటి నిజాం సర్కార్ మావాళ్లకు కొంత భూమి ఇచ్చారు. కాలక్రమేణా మా కుటుంబాల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో ఆ భూమిని మా తాతలకు నిజాం సర్కార్ ఇచ్చిన గుర్తుగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మా చుట్టుపక్కల భూములకు అధికారులు సర్వే చేస్తుంటే మా భూములను కూడా లాక్కుంటారేమో అని ఆందోళన కలుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని వదులకునేది లేదు.
– వీ బాలరాజు, హిమాయత్సాగర్