హైదరాబాద్: శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరికాసేపట్లో రన్వే పైనుంచి బయల్దేరనుండగా ఆ విమానాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా తిరుపతి బాదినేని, ఎల్ వినోద్ కుమార్, పీ. రాకేష్ కుమార్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు దుబాయ్ మీదుగా ఇరాక్ వెళ్తున్నట్లు గుర్తించారు. వారిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు మరో విమానంలో గమ్యస్థానాలకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ-మెయిల్ ఎవరు చేశారనే విషయమై విచారణ చేపట్టారు.