హైదరాబాద్: అమెరికా, యూరప్ దేశాలు వెళ్లేందుకు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల వ్యవహారంపై విదేశీ భాగస్వాములతో చర్చించాల్సి ఉందని, కావున విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని సుజనా చౌదరి దాఖలు చేసిన రిట్లో సోమవారం జస్టిస్ జి.రాధారాణి ఉత్తర్వులు జారీ చేశారు.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ.. రూ. ఆరు వేల కోట్ల వరకు మోసం చేసిందని సుజనాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ జారీ చేసిన లుకవుట్ నోటీసు వల్ల తను విదేశీ పర్యటనలకు వెళ్లలేకపోతున్నానని, గతంలో దుబాయ్ పర్యటనకు అనుమతించిన విధంగా ఈసారి కూడా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్రెడ్డి, న్యాయాది వి.విమల్ వాదించారు.
లుకవుట్ నోటీసు మనుగడలో ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో విదేశీ పర్యటనలకు ఆటంకం ఏర్పడకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించిన హైకోర్టు, లుకవుట్ నోటీసు అమల్లో ఉన్నదీ లేనిదీ వివరించాలని సీబీఐని ఆదేశించింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.