సిటీబ్యూరో, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ఇప్పటికే కరోనా రెండు వేవ్స్తో సతమతమవుతూ కోటుకుంటున్న ప్రజలను ఆఫ్రికా కొత్త వేరియంట్ మరో మారు భయాందోళనలో పడేసింది. దక్షిణ ఆఫ్రికాలో కలవర పెడుతున్న బి.1.1.529 అనే కొత్త వేరియంట్, డెల్టా కంటే వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళనతో అప్రమత్తమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తగా మారింది. కొత్త వేరియంట్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు గ్రేటర్ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించే శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించింది. గతంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంతో పాటు తాజాగా మరో రెండు ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వెల్లడించారు. ప్రధానంగా ఆఫ్రికా, యూకే దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేస్తున్నట్లు వివరించారు. విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
గ్రేటర్ వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు..
ఆఫ్రికాలో కలకలం రేపుతున్న కొత్త వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం, చేతులకు శానిటైజర్ పెట్టుకోవడం వంటి కొవిడ్ నియమాలతో పాటు కరోనా వైరస్ వల్ల కలిగే అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ కేంద్రాలను యథావిధిగా కొనసాగిస్తూ పరిస్థితుల ఆధారంగా ఈ కేంద్రాలను పెంచేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించే క్రమంలో సెకండ్ డోస్ టీకాను మరింత వేగవంతం చేశామని, గ్రేటర్లో ఇంటింటికీ వెళ్లి టీకాను వేస్తున్నట్లు తెలిపారు.
వైరస్పై నిర్లక్ష్యం వద్దు
వైరస్పై నిర్లక్ష్యం వద్దు. వైరస్ పూర్తిగా పోలేదు. వైరస్ను అరికట్టడంలో ప్రజలదే కీలక పాత్ర. కరోనా విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. విదేశాల్లో విజృంభిస్తున్న కొత్త వేరియంట్పై అప్రమత్తమయ్యాం. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా ఇం టింటికీ వెళ్లి కరోనా టీకా వేస్తున్నాం. నిర్ధారణ పరీక్షలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం. నగరంలో 126 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒక టి రెండు పాఠశాలల్లో కేసులు నమోదవడంతో డీఈఓల విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాం. జాగ్రతల అంశాలపై మూడంచెల చర్యలు తీసుకుంటున్నాం.
హై అలర్ట్ ప్రకటించాం
కొత్త వేరియంట్ నేపథ్యంలో శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హై అలర్ట్ ప్రకటించాం. విదేశీ ప్రయాణికులందరినీ స్క్రీనింగ్ చేస్తున్నాం. గతంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. యూకే, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరో రెండు స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా స్క్రీన్ చేస్తున్నాం. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన పనిలేదు. అప్రమత్తంగా ఉండాలి. కరోనా నియమాలు తూచ తప్పకుండా పాటించాలి.
– డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా;