Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గత రెండు, మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, సచివాలయం పరిసర ప్రాంతాలు, నెక్లెస్ రోడ్డు, ప్రజా భవన్, బేగంపేట్ ఏరియాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోతోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లక్డీకాపూల్ మెట్రో స్టేషన్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ఇక మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డు ఫ్లైఓవర్, ఖైరతాబాద్ జంక్షన్, తాజ్కృష్ణ, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 ఏరియాల్లో ట్రాఫిక్ కారణంగా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి ఈ ఒక్కరోజే కాదు.. ఈ ఏరియాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి కనబడుతోంది. ట్రాఫిక్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు పోలీసులను కోరుతున్నారు.