Hyderabad | హైదరాబాద్ : పశ్చిమ దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నగరంలో ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.1 డిగ్రీలు నమోదవగా గాలిలో తేమ 59శాతానికి పడిపోవడంతో ఉక్కపోత మొదలైంది. పగలు, రాత్రి సమయాల్లో కూడా వాతావరణం వేసవిని తలపిస్తుంది. మబ్బులు లేకపోవడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా రాగల 48 గంటల్లో నగరంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.