హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 8:30 గంటల వరకు మహేశ్వర్యంలో అత్యధికంగా 10.2 సెం.మీలు, గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు శేరీలింగంపల్లిలోని ఖాజాగూడలో 4.9 సెం.మీలు, రామచంద్రాపురంలో 4.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఉపరితల ద్రోణి, ఆవర్తనం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ కేంద్రం అధికారులు.