హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి ముసురు పట్టింది. అయితే రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తెలంగాణలోని 14 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అయితే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని చెప్పింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు జలకళ వచ్చింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైతులు కూడా పొలాల బాట పట్టి, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు.