సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో మంగళవారం గ్రేటర్లో పలు చోట్ల వాన దంచికొట్టింది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్వాసులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత ఉపశమనం కలిగించింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్ బీఆర్ అంబేద్కర్ భవన్ వద్ద 6.8సె.మీ, అమీర్పేటలో 2.8సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
దాదాపు గంట పాటు కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలవడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ శాఖ వెంటవెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా ఉత్తర-దక్షిణ ద్రోణి రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
చింతల్ శ్రీనివాస్నగర్-మాణిక్యనగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వరదనీరు
ఇండ్లలోకి చేరిన వరద నీరు..
కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, సెప్టెంబర్ 6: మంగళవా రం సాయంత్రం కుత్బుల్లాపూర్లో సుమారు గంటన్నర పాటు వర్షం దంచికొట్టింది. దీంతో కాలనీల్లో పూర్తిగా వర్షం వరదనీటితో దర్శనమిచ్చాయి. వర్షం ఏకదాటిగా కురవడంతో వాహనదారులు, పాదాచారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. దీంతో వర్షం అనంతరం ఒక్కసారిగా బయటకు రావడంతో ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా ట్రాఫిక్మయంగా మారాయి. కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో వర్షం అధిక మొత్తంలో కురవడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన నాలా పరివాహక ప్రాంతాల్లో వర్షం వరద పూర్తిగా మోకాళ్లలోతు పారాయి. దీంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, శ్రీనివాస్నగర్, వెంకన్నహిల్స్, అంబేద్కర్నగర్, బాపూనగర్, వాజ్పేయ్నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు జలమయంగా మారాయి. షాపూర్నగర్ ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరడంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
*సుభాష్నగర్ డివిజన్ పరిధి సూరారం కాలనీ తెలుగుతల్లి నగర్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఐదు ఇండ్లలో వరద నీరు చేరడంతో బాధితులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం 6 సెంటీ మీటర్ల భారీ వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు నీరు ఇండ్లలోకి చేరింది. దీంతో ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి మొత్తం నీటిలో తడిసిపోయాయి.
తెలుగుతల్లి నగర్లో ఓ ఇంట్లోకి చేరిన వరద నీరు