సిటీబ్యూరో: ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలతో గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఆదివారం సైతం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది. జీడిమెట్ల, గాజులరామారంలో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల వానలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుపుతూ.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా, నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన కార్యాలయం నుంచి జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.