ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తోంది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది కంటే ఈ సారి అధికంగా రూ.304 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా రూ. రెండు వేల కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించే విధంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ట్రేడ్ లైసెన్స్లు, ఆస్తిపన్ను బకాయిదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు ప్రతి రోజూ ఉదయం 8 గంటల కల్లా విధుల్లో చేరాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారి ఆస్తిపన్నుపై 2 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే నగరంలో చిన్నా, పెద్ద వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 1వ నుంచి ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని, సకాలంలో లైసెన్స్ పొందని పక్షంలో జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను వసూళ్లను రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది కంటే ఈ సారి అధికంగా రూ.304 కోట్ల ఆదాయం రావడం, మూడు నెలల ముందుగానే గత సంవత్సర స్థాయి ఆస్తిపన్ను వసూళ్లను రాబట్టడం గమనార్హం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూరడం ఒక కారణమైతే , కమిషనర్ లోకేశ్కుమార్తో సహా ఉన్నతాధికారులు ఆస్తిపన్ను వసూళ్లపై ప్రధానంగా దృష్టి సారించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందికి నెలవారీగా టార్గెట్లు ఇస్తూ టార్గెట్ రీచ్ అయ్యేలా ప్రయత్నం చేయడమే రికార్డు స్థాయి వసూళ్లు రావడానికి కారణం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికల్లా రూ. 2 వేల కోట్ల నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెకండ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారి ఆస్తిపన్నుపై 2 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
జోన్ల వారీగా ఆస్తిపన్ను వసూళ్లు..
గ్రేటర్ పరిధిలో ఆరు జోన్లు ఉండగా ఎక్కువగా ఆస్తిపన్ను వసూళ్లు ఖైరతాబాద్ జోన్ నుంచే వచ్చాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే రూ.585 కోట్లకు గానూ రూ. 369.85కోట్లు సమకూర్చారు. ఎల్బీనగర్లో రూ. 262 కోట్లకు గా రూ.205.6 కోట్లు వచ్చాయి. చార్మినార్లో రూ.172 కోట్లకు గానూ రూ.103 కోట్లు, శేరిలింగంపల్లిలో రూ.393 కోట్లకు గానూ రూ.306.37 కోట్లు, కూకట్పల్లిలో రూ.295 కోట్లకు రూ. 231.17కోట్లు, సికింద్రాబాద్లో రూ. 293 కోట్ల టార్గెట్కి రూ.200.77 కోట్లు వసూలయ్యాయి.
ప్రతి వ్యాపారి కొత్తగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి
నగరంలో చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒకసారి ట్రేడ్ లైసెన్స్ పొందితే ఏటా దానిని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ రెన్యువల్ అనే వెసులుబాటు ఇక ఉండదు. ఏటా ప్రతి వ్యాపారి కొత్తగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. సకాలంలో లైసెన్స్ పొందని పక్షంలో జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ నెల ఒకటి నుంచి ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. www.ghmc.gov.in వెబ్సైట్కి లాగిన్ అయి ట్రేడ్ లైసెన్స్ విభాగంలో వివరాలు నమోదు చేసుకోవాలి. చేస్తున్న వ్యాపారం, దుకాణా విస్తీర్ణాన్ని బట్టి సంబంధిత రుసుం చెల్లించి, ఆన్లైన్లో ప్రొవిజినల్ సర్టిఫికెట్ పొందవచ్చని అధికారులు తెలిపారు.