సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.0డిగ్రీలు, గాలిలో తేమ 18శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉన్నందున రాగల రెండు రోజులు నగరంలో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మానుష్యంగా రోడ్లు..
నగరంలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు జ్యూస్లతో పాటు ప్రకృతి సిద్ధమైన ముంజలు కొనుగోలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు నగర వాసులు జలవిహార్కు క్యూ కడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జలకాలాడుతూ..సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు.