మన్సూరాబాద్, మే 29: తాను మరణిస్తూ.. పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. నల్గొండ జిల్లా, చింతపల్లికి చెందిన మావిళ్ల వెంకటయ్య (34) వ్యవసాయం చేస్తుంటాడు. ఈనెల 24న వెంకటయ్య బైకుపై చింతపల్లిలోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్తుండగా, భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని.. చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు. ఐసీయూలో ఉంచి ఐదు రోజుల పాటు చికిత్స అందించినా.. ఆరోగ్యం కుదుటపడలేదు. వెంకటయ్య ఈనెల 28న బ్రెయిన్డెడ్కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు మృతుడి భార్య పార్వతమ్మతో పాటు కుటుంబసభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో అవయవదానానికి వారు ముందుకురాగా, వెంకటయ్యకు చెందిన రెండు మూత్రపిండాలు, లివర్, రెండు కార్నియాలను దానం చేశారు.