సికింద్రాబాద్, నవంబర్ 20: సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడ్డగుట్ట డివిజన్లో తన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ముందుగా డివిజన్ పరిధిలోని రియో పాయింట్ హోటల్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, పాద యాత్రను ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆయన వెంట ఉన్నారు. నగర డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మీతో పాటు పద్మారావుగౌడ్ తనయుడు రామేశ్వర్గౌడ్ ఎన్నికల ప్రచార పాదయాత్రలో భాగస్వాములయ్యారు. అడ్డగుట్టలో పద్మారావుగౌడ్కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మహిళలు మంగళ హారతులు పట్టారు. గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. పద్మారావు గౌడ్ నిర్వహించిన పాదయాత్రలో పలువురు ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొని ఆయనకు మద్దతు ప్రకటించి, బీఆర్ఎస్ లో చేరారు. అడ్డగుట్ట టీడీపీ సీనియర్ నేత గణేశ్ దంపతులు, వారి అనుచరులు పద్మారావు గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పద్మారావుగౌడ్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ద్విచక్ర వాహనం నడిపి..
అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని రియో పాయింట్ హోటల్ వద్ద నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్ సందడి చేశారు. గులాబీ రంగు ఉన్న ద్విచక్ర వాహనం నడిపి అందరిని ఆశ్చర్య పరిచారు.