ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) – 2021కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ముందుగా నిబంధనలు, అర్హతలు పూర్తిగా తెలుసుకున్న తరువాతే దరఖాస్తు నింపాలని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి చెప్పారు. దీనికోసం తమ వెబ్సైట్లో ఉంచిన బ్రౌచర్ను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. చివరి నిమిషంలో తొందర పడకుండా సమయం ఉన్నప్పుడే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా చేసుకోవాలన్నారు. తొందరలో దరఖాస్తులో తప్పులు నింపకుండా ఉండేందుకు, దరఖాస్తు పూర్తి చేసి, సబ్మిట్ చేసేటపుడు దానిని మరొక్కసారి సరిచూసుకోవాలని చెప్పారు. పదవ తరగతి సర్టిఫికెట్లో ఉన్న విధంగానే పేరు నమోదు చేయడంతో పాటు, ఫొటో స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్లను తమ వెబ్సైట్లో ఉంచామని, దాని ఆధారంగానే ప్రశ్నాపత్రం సిద్ధమవుతుందని వివరించారు. సిలబస్ పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లెతే ఈమెయిల్ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సరిచేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఆరు వేల దరఖాస్తులు అమ్మాయిలవే కావడం విశేషమని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఈ నెల 25 వరకు నింపవచ్చని, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 30వరకు, రూ. 2000 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు స్వీకరిస్తామని వివరించారు. ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (ఆన్లైన్ పరీక్ష) ద్వారా సెప్టెంబర్ 8 నుంచి నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ పరిధిలో కలిపి దాదాపు 40,000 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ యూనివర్సిటీల పరిధిలోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ టి. గంగాధర్, డాక్టర్ ప్యాట్రిక్ పాల్గొన్నారు.