శేరిలింగంపల్లి, మార్చి 7: ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల హవాలా నగదును రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ, రాయదుర్గం పోలీసులు కలిసి ఖాజాగూడ రహదారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఖాజాగూడ రహదారిపై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇన్నోవా క్రిస్టా వాహనంలో విక్రమ్ నగేశ్ అనే వ్యక్తిని గుర్తించిన పోలీసులు..
అనుమానంతో అతడి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న రెండు బ్యాగుల్లో రూ.50 లక్షల నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాను హెచ్పీ గ్యాస్ డీలర్నని, సికింద్రాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్నట్లు విచారణలో విక్రమ్ నగేశ్ తెలిపాడు. నగదుకు సంబంధించిన ఆధారాలు, బిల్లులు లేకపోవడంతో.. పోలీసులు విక్రమ్ నగేశ్ను అదుపులోకి తీసుకొని, వాహనం, నగదును సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును ఐటీ శాఖకు అప్పగిస్తామని, ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.