కీసర, నవంబర్ 16: తెలంగాణలో మూడోసారి మన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో గురువారం మంత్రి చామకూర మల్లారెడ్డి స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లను స్వయంగా మంత్రి కలిసి తనకు ఈసారి మళ్లీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ హయంలో వచ్చే స్కీంలను యధావిధిగా అందరికీ అందిస్తామని ఓటర్లను కోరారు. ఓటర్ల నుంచి మంత్రికి ఆపూర్వ స్పందన లభించింది. మంత్రి మాట్లాడుతూ, గత తొమ్మిదేండ్లలో మన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రభుత్వ హయంలో అమలు చేసిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు చారిత్రాత్మకమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మన తెలంగాణ రాష్ట్రం, మనమంతా అభివృద్ధిలో ముందుకెళ్తామన్నారు. మేడ్చల్లో బీజేపీ, కాంగ్రెస్లను తరిగికొట్టి వారికి అడ్రస్సు లేకుండా చేయాలన్నారు. మేడ్చల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలందరు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, కీసర ఎంపీటీసీ తటాకం నారాయణ శర్మ, బీఆర్ఎస్ నేతలు సుధాకర్ రెడ్డి, మోర రవికాంత్, నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, రామిడి ప్రభాకర్రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, బి. శంకర్ గౌడ్, బి.రమేశ్ గుప్త, ఎం.జంగయ్య యాదవ్, బోడుసు రమేశ్ యాదవ్, గుర్రం శ్రీధర్రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
మేడ్చల్: మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన కుర్మ సంఘం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటమే కాకుండా సొంత నిధులను సైతం ప్రజల కోసం వెచ్చిస్తున్న మంత్రి మల్లారెడ్డి గెలిపించుకుంటామని చెప్పారు. ఈ మేరకు గౌడవెల్లి గ్రామానికి చెందిన కుర్మ సంఘం సభ్యులు 100 మంది మంత్రి మల్లారెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి, తమ మద్దతును ప్రకటించారు. గ్రామంలో కుర్మల ఓట్లు 200 వరకు ఉంటాయని, మేమంతా మల్లారెడ్డికే ఓటేయాలని తీర్మానించుకున్నట్టు పేర్కొన్నారు.