విశాఖ టూ ఢిల్లీ.. వయా హైదరాబాద్
సరఫరా కోసం 20 – 25 ఏండ్లలోపు యువకుల ఎంపిక
విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా బిల్డప్
ఒక్కో ట్రిప్పుకు రూ.10వేలు బేరం
సికింద్రాబాద్లో పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు
52 కేజీల గంజాయి, లీటరు హాష్ ఆయిల్ను స్వాధీనం
పరారీలో ప్రధాన నిందితులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 – 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ విద్యార్థుల్లా, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా తయారుచేస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా దివ్యాంగులను సైతం వీరిలో భాగస్వాములను చేసి ఖరీదైన బ్యాగుల్లో గంజాయి, హాష్ ఆయిల్ నింపి వారిని ఏసీ బోగీల్లో ఎక్కిస్తున్నారు. పోలీసుల కండ్లుగప్పి మత్తు దందా చేస్తున్న ఢిల్లీ ముఠా గుట్టును ఎట్టకేలకు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రట్టుచేశారు. వారి వద్దనుంచి 52 కేజీల గంజాయి, లీటరు హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్భగవత్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఇమ్రాన్కు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో స్థిరపడిన రాజస్థాన్కు చెందిన విజయ్తో స్నేహం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం వేసి గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇమ్రాన్ ఆర్డర్ మేరకు విజయ్ విశాఖలోని పాడేరు, చింతపల్లికి చెందిన కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి గంజాయి, హాష్ ఆయిల్ను సేకరించాడు. సేకరించిన గంజాయి, హాష్ ఆయిల్ను విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి సరఫరా చేసేందుకు ఇమ్రాన్ ఉత్తర్ప్రదేశ్కు చెందిన 22 నుంచి 25 ఏండ్ల వయస్సు గల యువకులను (ఫయీమ్, జూనైద్, సారిక్, మహ్మద్ నజీమ్) ఎంపిక చేసుకున్నాడు. ఈ నెల 3న వారిని రైలులో విశాఖకు పంపాడు. 5న ఫయీమ్, జూనైద్, సారిక్, మహ్మద్ నజీమ్లు 52 కేజీల గంజాయి, లీటరు హాష్ ఆయిల్ను తీసుకుని దువ్వాడ రైల్వే స్టేషన్లో 3 టైర్ ఏసీ టిక్కెట్లను తీసుకుని గరీభ్థ్ రైలు ఎక్కి హైదరాబాద్కు బయలుదేరారు. 6న రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే స్టేషన్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో అదే రైలులో మౌలాలి రైల్వే స్టేషన్లో దిగారు.
కాగా రాత్రి 11 గంటలకు దక్షిణ్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రావడానికి మౌలాలిలో సికింద్రాబాద్ బస్సు ఎక్కారు. అయితే గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ బృందం తనిఖీలు నిర్వహించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 కేజీల గంజాయి, లీటరు హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ఇమ్రాన్, విజయ్ల కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న ఎస్ఓటీ సిబ్బందికి సీపీ రివార్డులను అందించారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, తదితరులు పాల్గొన్నారు. అయితే మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నలుగురు యువకులకు ఒక్క ట్రిప్పుకు ఒక్కరికి పదివేలు ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.