హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మూడు దశాబ్దాల నుంచి అపరిషృతంగా ఉన్న ఇరిగేషన్ ఇంజినీర్ల ప్రమోషన్ల సమస్య పరిష్కారం కోసం 12 సూపర్ న్యూమరరీ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ఇంజినీర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చొరవ తీసుకొన్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ను శుక్రవారం ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సర్వీస్ ఇంజినీర్ల, విశ్రాంత ఇంజినీర్ల సీనియారిటీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం మెరిట్ ఆధారంగా ఇంజినీర్ల ప్యానెల్ ఇంటిగ్రేటెడ్ లిస్టును తయారు చేయాలని నిర్ణయించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆ సమస్య మూడు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిందని, ఫలితంగా ఇంజినీర్లు ప్రమోషన్లకు నోచుకోలేని వాపోయారు.
ఈ సమస్యకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారన్నారు. అందుకోసం 13 చీఫ్ ఇంజినీర్, 4 సూపరింటెండెంట్ ఇంజినీర్ సూపర్న్యూమరరీ పోస్టులు మంజూరు చేశారని సంతోషం వ్యక్తంచేశారు. రజత్కుమార్కు కలిసిన వారిలో విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ప్రసాద్రెడ్డి, సహ అధ్యక్షుడు రామ్రెడ్డి, రమణానాయక్, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ చైర్మన్ టీ వెంకటేశం, హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్, కోటేశ్వరరావు, శంకరప్రసాద్ తదితరులు ఉన్నారు.