సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. ప్రభుత్వ చొరవతో నగరం నలుమూలలా ఎన్నో మల్టీనేషనల్, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. దీంతో నగరం అన్ని వైపులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నగరాన్ని ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తున్నది. ఈ సమస్య నుంచి నగర ప్రజలను బయటపడేసేందుకు జేఎన్టీయూ అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల నుంచి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు చేపట్టారు. రోడ్సేఫ్టీ, ట్రాన్స్పోర్టు మోడల్స్, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి మూడు అంశాలపై ‘తెలంగాణ గాట్ టెక్ టాలెంట్ (టీజీటీటీ) పేరుతో హ్యాకథాన్ నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. బ్లాక్బక్స్ అనే ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థతో కలిసి ట్రాఫిక్కు సంబంధించిన మూడు అంశాలకు పరిష్కారం కనుగొనడానికి విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు.
ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ప్రదర్శనలు..
విద్యార్థులు ఇన్నోవేషన్లు, నూతన కాన్సెప్టులపై హ్యాకథాన్లో ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి గురువారం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్థన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్, బ్లాక్బక్స్ ప్రతినిధి రాజ్కుమార్ వాల్పోస్టర్ను విడుదల చేశారు. దీంతో పాటు హ్యాకథాన్ చాలెంజ్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ 23వ తేదీ నుంచి ప్రారంభించారు. రిజిస్ట్రేషన్లకు డిసెంబర్ 23 వరకు చివరి గడువు విధించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనడానికి వివిధ ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్టీయూ హ్యాకథాన్ ఇన్చార్జి డాక్టర్ సురేశ్కుమార్ తెలిపారు.
దరఖాస్తుల ఎంపిక ఇలా…
హ్యాకథాన్ నిర్వహణలో భాగంగా మూడు ట్రాఫిక్ అంశాల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. వాటిని పది మందితో ఒక బృందంగా తయారు చేస్తారు. ఆ తర్వాత మూడు ఉత్తమ చాలెంజ్ బృందాలను ఎంపిక చేస్తారు. ఇందులో గెలుపొందిన వారికి మూడు బహుమతులు ప్రదానం చేయనున్నారు. మొదటి బృందానికి రూ.25 వేల నగదుతో పాటు బ్లాక్బక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఇస్తారు. అలాగే ద్వితీయ బృందానికి రూ.15 వేల నగదుతో పాటు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తారు. తృతీయ బహుమతికి రూ.10 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
84 రోజుల పాటు హ్యాకథాన్..
హ్యాకథాన్ చాలెంజ్లో కొత్త పరిష్కారాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత ఆన్లైన్ ద్వారా ప్రదర్శిస్తారు. అందులో భాగంగా డిసెంబర్ 23 నుంచి 31 వరకు తొలి విడుత ఫలితాలు ప్రకటిస్తారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 7 వరకు రెండో విడుత దాఖలు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15న తుది విడుత చాలెంజ్ను జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. మొత్తం 84 రోజుల పాటు హ్యాకథాన్ను నిర్వహించనున్నారు. రోడ్సేఫ్టీ, ట్రాన్స్పోర్టు మోడల్స్, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి మూడు అంశాలకు సంబంధించి సబ్జెక్టు నిపుణులతో పాటు రాష్ట్ర రవాణా శాఖ, పోలీస్ శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారుల ఆధ్వర్యంలో హ్యాకథాన్ పోటీలు నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్ పేర్కొన్నారు. అయితే పూర్తి వివారాలకు జేఎన్టీయూ హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.