సిటీబ్యూరో/మెహిదీపట్నం, జనవరి 12 (నమస్తే తెలంగాణ): హిట్ అండ్ రన్లో చాదర్ఘాట్ పోలీసుల నిర్లక్ష్యం మరువకముందే.. మరోసారి పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఆధార్ లేకుంటే.. కేసు నమోదు చేయమంటూ.. అదృశ్యమైన యువతి కుటుంబసభ్యులను తిప్పి పంపించారు. కనిపించకుండాపోయిన ఆ యువతి మొయినాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. హబీబ్నగర్ పోలీసుల నిర్లక్ష్యం బయట పడటంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్వయంగా ఠాణాకు వెళ్లి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి కారకుడైన ఎస్సైని సస్సెండ్ చేస్తూ, ఠాణా ఎస్హెచ్వోకు సీపీ మెమో జారీ చేశారు. అయితే, 10 రోజుల కిందట చాదర్ఘాట్లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి ..హిట్ అండ్ రన్లో చనిపోయింది..ఒక్కరేనని గుర్తించడంలో చాదర్ఘాట్ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కుటుంబసభ్యులే దవాఖానకు వెళ్లి మృతుడిని గుర్తించారు.
తాజా ఘటనలో అసలేం జరిగింది..
మల్లేపల్లి గోకుల్ నగర్ మొఘల్ గ్రౌండ్ సమీపంలో నివసించే తహసీన్ బేగం(22) బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్నది. ఈ నెల 8న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి కుటుంబసభ్యులు హబీబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వయస్సులో మిస్సింగ్ అంటే ఏమిటో అందరికీ తెలుసు…ఫొటో ఏదీ..? ఆధార్ కార్డు ఏదీ..మీరు ఈ ప్రాంతంలో ఉంటారని గ్యారెంటీ ఏమిటీ… ? ముందు వెళ్లి ఆ అమ్మాయి ఆధార్కార్డు, మీ ఆధార్ కార్డు పట్టుకొని రావాలం’టూ.. సెక్టార్ ఎస్సై శివ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 10న మరోసారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లినా… తుతూ మంత్రంగా వివరాలు తీసుకొని చూస్తామంటూ పంపించేశారు. కేసు మాత్రం నమోదు చేయలేదు. ఈ క్రమంలోనే మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాకారం వద్ద ఈనెల 8న అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యువతి మృతి చెందింది. సైబరాబాద్ పోలీసులు ఆ యువతి ఆచూకీ కోసం వివిధ ఠాణాల్లో అదృశ్యమైన కేసులను తెలుసుకున్నారు. వివిధ కోణాల్లో ఆధారాలను విశ్లేషించిన సైబరాబాద్ పోలీసులు.. ఆ మృతురాలు మల్లేపల్లికి చెందిన యువతిగా గుర్తించారు.
నిర్లక్ష్యంపై ఆగ్రహం..
సీపీ శ్రీనివాస్రెడ్డి హబీబ్నగర్ ఠాణాకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఆధార్ లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని తెలుసుకున్న సీపీ.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై శివను సస్పెండ్ చేస్తూ.. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు.