సిటీబ్యూరో, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..బడ్జెట్లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం..బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఒక్కటి పట్టాలెక్కలేదు.. భూ సేకరణపై స్పష్టత లేకుండా రూ.1090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ పనులకు గతేడాది డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించగా..22 నెలలు కావొస్తున్న పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదు..భూ సేకరణపై అడుగడుగునా అవాంతరాలు, న్యాయపరమైన చిక్కు ముడులు వెంటాడుతున్నాయి. సరైన ప్రణాళికలు లేకపోవడం, అధికారుల పనితీరులో అత్యుత్సాహం వెరసి కేబీఆర్ పార్కు ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు..ఎప్పుడు ప్రారంభిస్తారో? పూర్తికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో? అనేది అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. సర్కారు వైఫల్యంతో ట్రాఫిక్ పద్మవ్యూహాంలో వాహనదారులు చిక్కుకుని నరకయాతనను అనుభవిస్తున్నారు.
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హెచ్ సిటీ’(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూపకల్పన చేసింది. ద్విగిజయంగా గత ప్రభుత్వ పథకాల పేర్లను సక్సెస్ఫుల్గా మార్చేసిన కాంగ్రెస్ సర్కారు హెచ్ సిటీ ప్రాజెక్టు పనులపై ఆ స్థాయి ఫోకస్ పెట్టలేకపోయింది. ఫలితంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి కుంటుపడింది. గడిచిన 22 నెలలకు పైగా ఒక్క కొత్త ప్రాజెక్టు ముందడుగు పడలేదు.. 38 చోట్ల పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 7032 కోట్లు ఖర్చు చేయనున్నారు. 28 ఫ్లై ఓవర్లు, 13 అండర్పాస్లు, నాలుగు ఆర్వోబీలు, మూడు చోట్ల ఆర్యూబీలు, పది చోట్ల రహదారుల విస్తరణ పనులకు గానూ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండగా..నేటికీ టెండర్ దశలోనే ఉన్నాయి. 13 చోట్ల పనులకు టెండర్లు పిలవగా, వివిధ దశల్లో ఉన్నాయి. మరో 15 చోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సన్నద్దమవుతున్నారు. కాగా 30 చోట్ల పనులకు మాత్రం ప్రతిపాదన దశలోనే ఉండడం గమనార్హం. కాగా రూ. 780 కోట్ల నిధులు ప్రభుత్వం ఇస్తే కానీ భూ సేకరణ ముందడుగు పడని పరిస్థితి నెలకొంది. అన్నింటి కంటే మించి ఇటీవల కాలంలో నానల్నగర్, రేతిబౌలి ఫ్లై ఓవర్ల పనులు, కంటోన్మెంట్ ఐఓసీ పనుల టెండర్లకు కాంట్రాక్టర్లు అసక్తి చూపకపోవడంతో తిరిగి రీ టెండర్ కాల్ చేయడం హెచ్ సిటీ ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి వాయు వేగంతో 37 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టింది. ఏటా రూ.600-700కోట్ల మేర నిధులను ఖర్చు చేసి ఫ్లై ఓవర్లు, ఆర్వోబీ, ఆర్యూబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వరద నీటికి శాశ్వత పరిష్కారంగా ఎస్ఎన్డీపీ పథకాన్ని తీసుకువచ్చి రూ.985.45 కోట్లతో చేపట్టిన మొదటి విడుత పనులు రూ.592.68 కోట్లు ఖర్చు పెట్టి 39 చోట్ల పనులను పూర్తి చేసింది. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా సీఆర్ఎంపీ పథకాన్ని రూ. 900 కోట్లతో చేపట్టి ఆదర్శవంతమైన పథకంగా మార్చింది. ఐతే ఈ మూడు కీలక ప్రాజెక్టులకు గత సర్కారు రెండో దశ ప్రతిపాదనలతో సిద్ధం చేసి ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉండడం..ఈ సమయంలోనే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఈ పథకాల స్థానంలో హెచ్ సిటీ ప్రాజెక్టుగా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్న రవాణా వ్యవస్థ, మౌలిక వసతుల కల్పనకుగానూ హెచ్ సిటీ కింద కేవలం రూ. రూ.2675.35 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులను ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడం, ఆ ప్రభావం పనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మొత్తంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలు కొత్తవి ప్రారంభం కాకపోవడం, పురోగతి ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం, నాలా పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న ఫలితంగా అటు ట్రాఫిక్, ఇటు వరద ముంపు సమస్యలు తప్పడం లేదు. నామమాత్రంగా జంక్షన్ల అభివృద్ధి, సీసీ రోడ్ల పనులు తప్ప కీలకమైన ప్రాజెక్టులు ఒక్కటి ముందడుగు పడకపోవడంపై నగర పౌరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులలో ఏ ఒక్క చోట పనులు మొదలు పెట్టలేదు..కొన్ని టెండర్ దశలో ఉండగా, మరికొన్ని టెండర్ దశ దాటి భూ సేకరణ చిక్కుల్లో నలిగిపోతుంది. మరికొన్ని డీపీఆర్ దశలోనే కాగితాలకు పరిమితం కావడం అధికారుల పనితీరును నిదర్శనం.