Hyderabad | ఎల్బీనగర్, జూలై 5: సీజ్ చేసిన ఐరన్ స్క్రాప్ దుకాణం పంచనామాకు వచ్చిన జీఎస్టీ అధికారులను సదరు షాపు నిర్వాహకులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లో బుధవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి కిడ్నాప్కు గురైన అధికారులను విడిపించి నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను సరూర్నగర్ సీఐ జానకీరెడ్డి మీడియాకు వెల్లడించారు. సరూర్నగర్లోని సాయికృష్ణానగర్ కాలనీలో గ్రేడ్ 1 ఇనుప స్క్రాప్ దుకాణం ఉన్నది. జీఎస్టీ చెల్లించడం లేదని, ఫేక్ జీఎస్టీ వాడుతున్నారని ఆ షాపును మంగళవారం అధికారులు సీజ్ చేశారు.
దుకాణం పంచనామా కోసం జీఎస్టీ కార్యాలయం నుంచి జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ మనీస్శర్మ, సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి వీడీ ఆనంద్రావు బుధవారం ఉదయం 1.30 గంటలకు ఆ షాపు వద్దకు వచ్చారు. ఈ సమయంలో దుకాణంలో ఉన్న ఖమ్యుం, ఫీరోజ్ తదితరులు అధికారుల ఐడీ కార్డులు చింపి.. వారిపై దాడిచేశారు. అధికారులను నిర్బంధించి ఫార్చునర్ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వైపు తరలించారు. వెంటనే అధికారుల వాహన డ్రైవర్ తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించారు. అధికారుల ఫోన్ నంబర్ జీపీఎస్ ఆధారంగా వారు కొత్తపేట మీదుగా నగరం వైపు వస్తున్నారని గమనించి దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ వద్ద కారును గుర్తించారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఇద్దరు జీఎస్టీ అధికారులను విడిపించారు. కిడ్నాప్ ఘటనలో పాల్గొన్న గ్రేడ్ 1 స్క్రాప్ దుకాణం యజమాని సయ్యద్ ఫిరోజ్ (36), సయ్యద్ ముజీబ్ (37), షేక్ ముషీర్ (29), సయ్యద్ ఇంతియాజ్ (33)ను అరెస్టు చేశారు. వీరంతా గుంటూరు టీడీపీ నాయకుడు ముజీబ్ సోదరులు. ఈ కేసులో మరో ప్రధాన సూత్రధారి ఖయ్యుం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.