Gruha Jyothi | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు అడుగడుగునా నిరాశే ఎదురవుతున్నది. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు అది ఒక్కరోజు మురిపెంగానే మిగిలింది. సీఎం రేవంత్రెడ్డి అట్టహాసంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించేందుకు జిల్లాలోని చేవెళ్లను ఎంపిక చేసుకున్నారు.
తీరా… మహబూబ్నగర్-రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిందంటూ.. ప్రభుత్వ ఖర్చుతో చేపట్టిన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వినియోగించుకున్నది. ఈ నేపథ్యంలో కోడ్ ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలో పథకాన్ని ప్రారంభించకుండా ఉండాలి. కానీ ఒకటో తేదీన పలు ప్రాంతాల్లో జీరో బిల్లులను జారీ చేసి.. ఘనంగా ప్రచారం చేసుకున్నారు. అయితే మరుసటి రోజు నుంచే కోడ్ ఉందంటూ పథకాన్ని అటకెక్కించారు. ఒకవైపు ఎమ్మెల్సీ.. రేపోమాపో పార్లమెంటు ఎన్నికల కోడ్తో రంగారెడ్డి జిల్లా ప్రజలకు జూన్ దాకా ‘గృహజ్యోతి’ అందే అవకాశాలు లేవు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు అందని ద్రాక్షగా మారింది. ప్రచారం కోసం నామమాత్రంగా గుప్పెడు మందికి జీరో బిల్లులను జారీ చేసిన టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు.. ఆపై కోడ్ పేరిట పథకం అమలును నిలిపివేశారు. సాధారణ కరెంటు బిల్లులను జారీ చేస్తూ ముక్కుపిండి చార్జీలను వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పథకాన్నీ సీఎం రేవంత్రెడ్డి గత నెల 27న ప్రారంభించారు. తొలుత పథకం ప్రారంభానికి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లను ఎంపిక చేసుకున్నారు. అయితే గత నెల 26న నల్గొండ-మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ జారీ అయింది.
ఈ రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం పథకం ప్రారంభ వేదికను సచివాలయానికి మార్చింది. అయితే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అసలు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జీరో బిల్లుల జారీనే చేపట్టవద్దు. కానీ ఈ నెల 1న జిల్లాలోని అనేక చోట్ల మీటర్ రీడర్స్ వేలాది మందికి జీరో బిల్లులను జారీ చేశారు. వాటికి అట్టహాసంగా ప్రచారాన్ని కల్పించారు. కొన్నిచోట్ల ఉదయం 11 గంటల వరకు జీరో బిల్లులు జారీ చేసి, ఆ వెంటనే నిలిపివేశారు.
ఈ నెల 1న జీరో బిల్లులు జారీ చేసిన అధికారులు.. మరుసటి రోజు నుంచే దానిని నిలిపివేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున పథకం అమలు చేయొద్దంటూ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. బయటికి ఎన్నికల కమిషన్ వద్దని చెప్పిందంటూ అధికారులు చెబుతున్నా… దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే షాద్నగర్ వంటి ప్రాంతాల్లోనైతే 1న ఉదయం 11 గంటల వరకు జీరో బిల్లులు జారీ చేసి.. ఆ వెంటనే దానిని నిలిపివేసి, జీరో బిల్లులు ఇచ్చిన వారికి తిరిగి సాధారణ బిల్లులు కూడా ఇచ్చారు.
చేవెళ్లలోని షాబాద్ వంటి ప్రాంతాల్లో వందల మందికి జీరో బిల్లులు ఇచ్చి తదుపరి మీరు సాధారణ బిల్లులు చెల్లించాల్సిందేనని మీటర్ రీడర్లు లబ్ధిదారులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలోనూ మొదటి రోజు జీరో బిల్లులు జారీ ఆపై నిలిపివేశారు. దీనిపై అధికారులను సంప్రదిస్తే.. ఏదో ట్రయల్ రన్ చేశామంటూ చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేయని ట్రయల్ రన్ ఇక్కడ మాత్రమే ఎందుకు చేశారనేది అధికారులకే తెలియాలి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో జీరో బిల్లుల జారీకి యంత్రాలను తీసుకువచ్చి… ఆతర్వాత వాపస్ తీసుకుపోయారు. ఇలా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధుల్లో పథకం అమలు అనేది గందరగోళంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చినా.. ఆన్గోయింగ్ పథకం అయినందున దానిని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో కోడ్ కారణంగా ప్రారంభించలేదు. ఈ నెలలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ కోడ్ మే వరకు అమల్లో ఉండనున్నది.
అంటే జూన్లో వచ్చే బిల్లుల సమయంలో మాత్రమే ఈ జిల్లాల వారికి పథకం అమలయ్యే అవకాశమున్నది. అంటే మూడు నెలల పాటు అర్హులైన లక్షలాది మంది లబ్ధిదారులు సైతం సాధారణ కరెంటు బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మూడు నెలల పాటు బిల్లులు చెల్లించిన లబ్ధిదారులకు ప్రభుత్వం తదుపరి రీయింబర్స్ చేస్తుందా? లేదా మరో రకంగా సర్దుబాటు చేసి లబ్ధిదారులకు ఏమైనా భరోసా ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నది.