OTT apps : దేశంలో ఓటీటీ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఇలాంటి 50 ఓటీటీ యాప్స్ను నిషేధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి డా.ఎల్.మురుగన్ వెల్లడించారు. దేశ చట్టాలను ఉల్లంఘించి, అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేసినందుకే వాటిని నిషేధించామని మంత్రి లోక్సభలో తెలిపారు.
అయితే, ఇలా ఓటీటీలను నిషేదించడం ఇదే మొదటిసారి కాదు. నిబంధనలు ఉల్లంఘించి, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కేంద్రం నిషేధం విధిస్తూనే ఉంది. ఐటీ (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ ఆఫ్ 2021ను అనుసరించకపోవడం వల్ల ఆయా ఓటీటీలపై నిషేధం విధించింది. అలాగే, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 294, సెక్షన్ 4 (ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమన్ (ప్రొహిబిషన్) యాక్ట్ ప్రకారం ఓటీటీలపై నిషేధం విధించింది. ఈ సెక్షన్ల ప్రకారం మహిళలను అభ్యంతరకరంగా చూపించినందుకు ఈ సెక్షన్ల ఆధారంగా చర్యలు తీసుకుంటారు. తాజాగా నిషేధం విధించిన యాప్స్ వివరాలను మాత్రం కేంద్రం వెల్లడించలేదు. వాటి వివరాల్ని రహస్యంగానే ఉంచుతామని కేంద్రం ప్రకటించింది.
చట్టాల్ని ఉల్లంఘిస్తూ కంటెంట్ ప్రసారం చేసే వాటిపై నిరంతరం నిఘా పెడతామని కేంద్రం తెలిపింది. కేంద్ర నిషేధం అంటే ఓటీటీ యాప్లను యాప్ స్టోర్స్ నుంచి తొలగించడం మాత్రమే కాదు. వాటికి సంబంధించిన అన్ని వివరాల్ని బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా కేంద్రం ఆదేశించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో నిషేధిత యాప్స్ కనిపించవు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారికి వాటిని యాక్సెస్ చేసే వీలుండదు. గత ఏడాది కూడా ఆల్ట్, ఉల్లు, దేశిఫ్లిక్స్ వంటి వాటిని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.