Gruha Jyothi | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఎంతో ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అరకొరగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురవుతున్నది. 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే వారందరికీ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. అడ్డగోలు నిర్ణయాలతో తాము ఇచ్చిన హామీలకే తూట్లు పొడుస్తోంది. అందుకు నిదర్శనమే గృహజ్యోతి పథకం.
గ్రేటర్లో 200 యూనిట్ల విద్యుత్ వాడే వారు 34 లక్షల మందికి పైగా ఉన్నారు. అందులో కేవలం మూడింట ఒక వంతు మంది వినియోగదారులకే ఈ పథకాన్ని అమలు చేస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9 సర్కిళ్లలో గృహజ్యోతి పథకాన్ని శుక్రవారం నుంచి అమలు చేస్తూ..లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అమలు చేసేలా చర్యలు చేపట్టారు. 9 సర్కిళ్లలో విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లులు అందజేశారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 48 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉండగా, అందులో సుమారు 34 లక్షల వరకు 200 లోపు యూనిట్లు వాడుతున్నట్లు డిస్కంలో లెక్కలు ఉన్నాయి. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్ల రేషన్ కార్డు నిబంధనతో విద్యుత్ శాఖ అధికారులు ఫిబ్రవరి లో గృహజ్యోతి పథకం లబ్దిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. నెల చివరి నాటికి గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో మొత్తం 11 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు మాత్రమే గృహ జ్యోతి పథకం కింద అర్హులుగా గుర్తించారు.
మార్చి 1 నుంచి జీరో బిల్లులను జారీ చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల సుమారు 23 లక్షల మంది వరకు ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతిని పొందలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ద్వారా సుమారు 19.85 లక్షల మంది 200 యూనిట్లలోపే కరెంటును వినియోగిస్తున్నామని, తమకు ఈ పథకాన్ని అమలు చేయాలని దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం 11 లక్షల మందికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఉండటంతో వారికే ప్రభుత్వం అవకాశం కల్పించింది.
తెల్లరేషన్ కార్డు ఉండి గృహ జ్యోతి పథకానికి అర్హత పొందని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆరు గ్యారెంటీల అమలు కోసం నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారు కొత్తగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో నివాసముండే వారు సర్కిల్ కార్యాలయాలు, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారు ఆయా కార్యాలయాల్లో గృహజ్యోతి పథకం లబ్ధికోసం అవసరమైన ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లును ఇవ్వాలని సూచించారు.