Gruha Jyothi | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది వచ్చి ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లతో పాటు మొబైల్ నంబర్లను తీసుకోనున్నారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు 52 లక్షల వరకు ఉంటే అందులో సుమారు 30 లక్షల లోపు వినియోగదారులు 200 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నట్లు సమాచారం.