గ్రూప్-1 అభ్యర్థుల అవగాహన సదస్సులో వినోద్ కుమార్
చిక్కడపల్లి (హైదరాబాద్), జూలై 3: ప్రత్యేక తెలంగాణ రాకతోనే సత్ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్నామని వివరించారు. అశోక్నగర్ లోని 21 సెంచరీ ఆధ్వర్యంలో గ్రూప్-1 అభ్యర్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ.. అభ్యర్థులు తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు అధిక సంఖ్యలో కల్పించాలనే లక్ష్యం కారణంగానే ఉద్యోగ ప్రకటన కాస్త ఆలస్యమైందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాలపైనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని వినోద్కుమార్ గుర్తుచేశారు. ఆనాటి నుంచీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు ఉద్యమ దశలను ఆయన గ్రూప్-1 అభ్యర్థులకు వివరించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వివిధ పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు. కోటి ఎకరాలకు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు గత దశాబ్దానికీ, ఇప్పటికీ గణనీయంగా మార్పు చెందాయని తెలిపారు. 1వ తేదీన రుణాలకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తున్న రాష్ట్రం దేశం మొత్తంలో తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీయువకులు డ్రీమ్-గోల్-ప్లానింగ్ (డీజీపీ) ఫార్ములాను తప్పకుండా పాటించాలని తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉన్నదని అభ్యర్థులు తెలుసుకోవాలని సూచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్గౌడ్ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ చైర్మన్ కృష్ణ ప్రదీప్, డైరెక్టర్ రమణా రెడ్డి, విశ్వానాథ్ తదితరులు పాల్గొన్నారు.