సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఇలా చేస్తేనే నీటి సమస్యకు పరిష్కారం..
ఎన్విరాల్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నోడల్ ఏజెన్సీగా జీహెచ్ఎంసీ, జలమండలి, భూగర్భజలవనరుల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించాలి.. ఇలా చేస్తేనే నీటి సమస్యకు పరిష్కారం.. అని భావించి ఈ మేరకు ఇటీవల ఈ శాఖల అధికారులు ప్రత్యేక సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
‘క్లైమెట్ రిసిలియంట్ సిటీ’ పేరిట..
‘క్లైమెట్ రిసిలియంట్ సిటీ’ పేరిట ప్రతిపాదనలు రూపొందించారు. గ్రీన్ ైక్లెమెట్ ఫండ్ కోటాలో వరల్డ్ బ్యాంకు సహయంతో రూ.230 కోట్లతో మూడు రకాల కార్యాచరణ అమలుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందానికి త్వరలోనే సమర్పించనున్నారు. గ్రీన్ ైక్లెమెట్ ఫండ్ కోటాలో ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు వరల్డ్ బ్యాంకు బృందం నగరానికి రానున్నదని అధికారులు పేర్కొన్నారు.
8 ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
8 ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. సంబంధిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, ఇంటి ప్రాంగణంలో, ఉద్యానవనంలో, రోడ్డు పక్కన రీచార్జి గుంటలు, కందకాల నిర్మాణం, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు వరద వచ్చే మార్గం వద్ద ఇంజక్షన్ బోర్వెల్స్ వేయడం లాంటివి చేయనున్నారు. అలాగే పార్కులు, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా భారీ సంపులను ఏర్పాటు చేసి అందులోకి వరద నీటిని పంపించి భూగర్భ జలాలను రెట్టింపు చేయనున్నారు.
ప్రధానంగా మురుగునీటి శుద్ధి ప్రక్రియలో భాగంగా శుద్ధి అవుతున్న నీరు వృథాగా మూసీలోకి వెళుతున్నది. అలా వెళ్లకుండా శుద్ధి చేసిన నీటిని పార్కులు, గార్డెనింగ్, భవన నిర్మాణాలకు వినియోగించడం ద్వారా ఇబ్బడి ముబ్బడిగా బోర్ల వినియోగం తగ్గించడంతో భూగర్భ జలాలను పరిరక్షించడం సాధ్యమవుతుందని అంచనా వేశారు. వీటితో పాటు ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రతి ఇంటి నుంచి రెండు రకాల పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. టాయిలెట్ల నుంచి వచ్చే లేన్, కిచెన్ నుంచి ప్రత్యేకంగా మరో లేన్ ద్వారా శుద్ధి ప్రక్రియ సులభతరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతిపాదన దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
మూడు రకాల ప్రణాళికలు
గ్రౌండ్ వాటర్ టేబుల్ను పెంచడం, ఎంపిక చేసిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో వర్షపు నీరు బయటకు రాకుండా సద్వినియోగించేలా చర్యలు చేపట్టడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలలో (ఎస్టీపీ ప్లాంట్ల) శుద్ధి అయిన నీటిని తాగునీటికి మినహా మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం లాంటివి చేపట్టేలా మూడు రకాల ప్రణాళికలను రూపొందించారు.