సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకంలో భాగంగా గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అమలుకు అర్హులను గుర్తించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మంగళవారం చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ నేతృత్వంలో ఉన్నతాధికారులు హైదరాబాద్ సెంట్రల్ జోన్ గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అశోక్నగర్ సెక్షన్లో విద్యుత్ వినియోగదారుల ఇండ్లకు వెళ్లారు.
ఇంటింటికీ వెళ్లి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో కలిసి విద్యుత్ వినియోగదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్కార్డు, ఫోన్ నంబరు సేకరించి స్పాట్ బిల్లింగ్ మిషన్లో నమోదు చేయించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలో సుమారు 1800 మంది కరెంటు మీటర్ రీడర్లు ఉన్నారు. వీరంతా ఈ నెల 15 వరకు ఇదే పనిలో ఉంటారని, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అర్హులైన వారికి గృహ జ్యోతి పథకం అమలు చేస్తామని తెలిపారు.