నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. సాంకేతిక సంస్కరణలతో పటిష్టంగా శాంతిభద్రతలు.. షీటీమ్స్తో మహిళలకు భద్ర త.. ఇలా వివిధ అంశాలను తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడించారు. నగరం అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే పర్యావరణ సంరక్షణలో గ్రేటర్ హైదరాబాద్ ముందంజలో ఉంది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా విస్తృతమైన పచ్చదనం అభివృద్ధి చెందినట్లుగా తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 2015-21 వరకు ఏటా గ్రీన్ కవర్ 6.85శాతం వృద్ధి చెందినట్లుగా వెల్లడించింది. గడిచిన పదేళ్ల కాలంలో అన్ని మెట్రో నగరాల కంటే ఎక్కువగా 146.8 శాతం పెరిగింది. అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో పుష్కలమైన లంగ్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది.
హెచ్ఎండీఏ పరిధిలో 14,708 ఎకరాల విస్తీర్ణంలో 16 ప్రాంతాల్లో రూ. 116.63 కోట్లతో ఫారెస్టు బ్లాకును నిర్మిస్తుండగా ఇందులో 6 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 158 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఔటర్ రింగు రోడ్డు, ఇంటర్ చేంజెస్ ప్రాంతాల్లో 457.23 ఎకరాల విస్తీర్ణంలో 71 లక్షల మొక్కలు నాటింది. ఇక 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి చేస్తుండగా, ఇందులో 48 పార్కుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 14 వాటర్ బాడీస్లను రిక్రియేషనల్ జోన్లుగా తీర్చిదిద్దింది. రూ. 137 కోట్లతో 57 థీమ్ పార్కులను అభివృద్ధి చేశారు. 406 లే అవుట్ల పరిధిలో ఉన్న ఓపెన్ స్పేస్లలో ప్లాంటేషన్ కోసం గుర్తించగా… వీటిని స్థానికుల అవసరాలకు అనుగుణంగా ట్రీ పార్కులను అభివృద్ధి చేయనుంది.
తెలంగాణకు హరితహారం పథకానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్య రాజ్యసమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), అర్భన్ డే ఫౌండేషన్ హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా వరుసగా రెండు సార్లు గుర్తించింది. భారతదేశంలో నుంచి ఈ గుర్తింపు సాధించిన ఏకైక నగరం హైదరాబాద్.
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు-2022లో భాగంగా సికింద్రాబాద్ (కంటోన్మెంట్ బోర్డు) అవార్డు ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అవార్డు వరించింది.
గ్రేటర్ ప్రజల సౌకర్యార్థం ఉచిత తాగునీటి పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తున్నది. ప్రస్తుతం 6.5 లక్షల మంది వినియోగదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. ఇదే సమయంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు చేస్తున్నది. 43,244 మందికి రూపాయి నల్లా కనెక్షన్లు మంజూరు చేశారు.
గ్రేటర్లో సౌర వెలుగులే లక్ష్యంగా జీహెచ్ఎంసీ 941 కిలోవాట్ల సామర్థ్యంలో 34 ప్రభుత్వ కార్యాలయాల మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేవారు. ఇందుకోసం రూ. 3.5 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. ఏటా రూ.1.3 కోట్ల మేర విద్యుత్ ఆదా కానుంది.
సిటీ గ్రీన్ కారిడార్కు అంతర్జాతీయ గుర్తింపు
ప్రణాళికబద్ధమైన హారితహారం ద్వారా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆర్బార్ డే ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే గ్రీన్ అవార్డులకు 2020, 2021 వరుసగా ఎంపికైంది. 2022లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అవార్డును కైవసం చేసుకోగా, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ ఇంక్లూసివ్ గ్రోత్ అవార్డును సొంతం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో సాధ్యమైంది.
మెరుగ్గా మెట్రో సేవలు..
నగరంలో 69 కి.మీ మేర విస్తరించిన మెట్రో రైలులో నిత్యం 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రెండో దశను నిర్మిస్తోంది. అలాగే ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కి.మీ కొత్తగా మెట్రో మార్గాన్ని నిర్మించే పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ మెట్రో మార్గం వల్ల ఐటీ కారిడార్, విమానప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడించారు.
ఏరోస్పేస్ సెక్టార్కు ప్రాధాన్యత..
వ్యాపార రంగంలో ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టర్ చాలా కీలకమైనదిగా గుర్తించి దానికి అవసరమైన విధివిధానాలు రూపొందించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఈ రంగంలోనే స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఏరో స్ట్రక్చర్స్, ఏరో ఇంజిన్స్, ఎంఆర్వో, ఇంజినీరింగ్, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. స్పేస్ సెక్టర్, డ్రోన్స్ తయారీలోనూ అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్ల కోసం పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్ఈజెడ్, నాదర్గుల్ ఏరోస్పేస్ పార్క్, జీఎంఆర్ ఏరో స్పేస్ ఎస్ఈజెడ్, హర్డ్వేర్ పార్కు-1, 2, ఈ-సిటీ వంటివి ఉన్నాయి.
విమానప్రయాణం.. వృద్ధిరేటు
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం ఏటా గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేస్తోంది. అక్టోబర్ 2022 నాటికి శంషాబాద్ ఎయిర్పోర్టులో 65 దేశీయ, 17 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాల రాకపోకలకు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు విమాన ప్రయాణీకులు 116.30 లక్షలు కాగా వృద్ధి రేటు 106.9 శాతం ఉంది. అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ పరంగా చూస్తే ఏప్రిల్-అక్టోబర్-2021 మధ్య కాలంలో 5.6లక్షల మంది ఉంటే ఏప్రిల్-అక్టోబర్ -2022 మధ్య కాలంలో 18.7 లక్షలుగా నమోదై 233 శాతంగా వృద్ధి రేటు ఉంది. మొత్తం ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్ 58,676 నుంచి 91, 767 ఉండగా, కార్గో ట్రాఫిక్ 80,200 మెట్రిక్ టన్నుల నుంచి 83,892 మెట్రిక్ టన్నులుగా ఉందని నివేదికలో వెల్లడించారు. అదేవిధంగా విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఫార్మా జోన్, ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ ఫెసిలిటీ సౌకర్యం 1,50,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉంది.
వీ హబ్ నుంచి 5,235 మంది మహిళావ్యాపారవేత్తలు
మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా వి హబ్ను 2018లో ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటి వరకు 2,194 స్టార్టప్లు, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు ప్రోత్సాహం అందించారు. వీటి ద్వారా 5,235 మంది మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఫలితంగా 2,823 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు దక్కాయని తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్-2023లో పేర్కొన్నారు.
700 ప్రోటోటైప్స్కు రూపకల్పన
స్టార్టప్లను ప్రోత్సహించడమే కాకుండా సరికొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు దేశంలోనే మొట్ట మొదటి ప్రోటోటైపింగ్ సెంటర్ను టీ వర్క్స్ పేరుతో టీ హబ్ పక్కనే ఏర్పాటు చేసింది. టీ వర్క్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 250 స్టార్టప్లు, 15 ఎంఎస్ఎంఈలు నమూనా ఉత్పత్తులను, ఇతర ఉత్పత్తులను ఇక్కడ తయారు చేసుకున్నాయి. ఇక్కడ ఇన్నోవేటివ్ మెషిన్ ఆన్ క్లౌడ్ ఫ్లాట్ఫామ్ అయిన ప్రోటో టీవర్క్స్ ద్వారా ఇప్పటి వరకు 700 ఉత్పత్తులు, ప్రోటోటైప్స్(నమూనాలు) రూపొందించారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు 16 మెంటారింగ్ సెషన్లను నిర్వహించారు.
2,500 స్టార్టప్లు
2015లో ప్రారంభించిన టీ హబ్లో ఇప్పటి వరకు 2,500 స్టార్టప్లను ప్రోత్సహించారు. వెయ్యికి పైగా స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహించి, 12,000లకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించింది. టీ హబ్కు మంచి స్పందన ఉండడంతో రెండో దశ టీ హబ్ను జూన్-2022లో ఏర్పాటు చేసి, రెట్టింపు స్థాయిలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవ జాతీయ స్థాయిలో జరిగిన నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022లో తెలంగాణకు బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అవార్డు దక్కింది. దీనికి అదనంగా యువత, పిల్లలను ప్రోత్సహించేందుకు వై హబ్ను ప్రారంభించింది.